జగన్ నుంచి ప్రాణహాని ? ఆయన్ను నమ్ముకునే పోటీ ! బీటెక్ రవి కామెంట్స్..
ఏపీలో సీఎం వైఎస్ జగన్ కుటుంబం ఎప్పటి నుంచో వరుసగా గెలుస్తున్న పులివెందుల నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ అభ్యర్ధులు పోటీ చేయడం, ఓడిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులపై పోటీ చేసి సీఎం జగన్ పై నెగ్గుతానని టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై ప్రజా వ్యతిరేకతను నమ్ముకునే తాను బరిలోకి దిగబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజాగా ప్రభుత్వం బీటెక్ రవి భద్రతను తొలగించింది. దీనిపై పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.15 ఏళ్లుగా తనకు సెక్యూరిటీ ఉందని, ఉన్నపళంగా తన సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని రవి ఆరోపించారు.పులివెందులకు సీఎం వస్తే 3 వేల మంది సెక్యూరిటీ పెట్టుకుంటున్నారని, ఆయన పైన పోటీ చేసే తనకు 1+1 సెక్యురిటీ కూడా ఇవ్వలేరా అని బీటెక్ రవి ప్రశ్నించారు.

తన ప్రాణానికి సీఎం హామీ ఇస్తే ఎలాంటి భద్రత అవసరం లేదని టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. తనకూ, వైఎస్ జగన్ కూ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. వైయస్ కుటుంబంతో తనకు ఉన్నది రాజకీయ శత్రుత్వం మాత్రమేనన్నారు. తన ప్రాణానికి జగన్ , భారతి, అవినాస్ రెడ్డి నుంచి హాని ఉందని బీటెక్ రవి తెలిపారు. పాత భవనాలు కూల్చి కొత్త భవనాలు కట్టడమే పులివెందులకు జగన్ చేసిన గొప్పపని అని ఆయన ఎద్దేవా చేశారు.
సీట్ల మార్పులో చివరికి జగన్ తన సీటు కూడా మార్చుకుంటాడనే భయం ఉందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. జగన్ పై ఉన్న వ్యతిరేకతను నమ్ముకునే తాను ఆయనపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ జగన్ సీటు మార్చుకుంటే తనను కూడా అక్కడి నుంచే పోటీ చేయించాలని చంద్రబాబును కోరుతున్నట్లు బీటెక్ రవి వెల్లడించారు.












Click it and Unblock the Notifications