జగన్ ఉన్నాడనే, షరతుల్లేకుండా బిజెపిలో: పురంధేశ్వరి
విశాఖపట్నం: తాను ఎలాంటి షరతులు విధించకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని మాజీ కేంద్రమంత్రి, విశాఖ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం చెప్పారు. ఉదయం ఆమె విశాఖలో కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈ నెల 13న బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో బిజెపిలో చేరనున్నారు.
కాగా, విశాఖలో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఎలాంటి షరతులు లేకుండా బిజెపిలో చేరుతానన్నారు. తాను రేపు ఢిల్లీకి వెళ్లి సుష్మా స్వరాజ్, అద్వానీ, అరుణ్ జైట్లీలను కలుస్తానని చెప్పారు. పార్టీలో చేరుతున్నా తన నుండి వారిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవన్నారు. తాను ఇప్పటి వరకు పలు పార్టీలతో మాట్లాడినట్లుగా ప్రచారం సాగిందని కానీ, అది అవాస్తవమన్నారు.

ఇప్పటి వరకు తాను ఏ పార్టీలతో చర్చలు జరపలేదని, తన కార్యకర్తలను కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనతో కలిసి రావాలని ఎవరి పైన తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరినా విశాఖ నుండే పోటీ చేస్తానని ఆమె చెప్పారు.
జగన్, కెసిఆర్ ఉన్నారనే... కాంగ్రెస్ పైన నిప్పులు
బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించిన పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. తమను పట్టించుకోకుండా కాంగ్రెసు పార్టీ విభజన చేసిందన్నారు. తమ సూచనలు ఏవీ పట్టించుకోలేదన్నారు. తన నియోజకవర్గం గురించిన అంశాలు కూడా తనను తీవ్రంగా బాధించాయన్నారు.
సీమాంధ్రకు కాంగ్రెసు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ఒక్క సీటు రాకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందనే అభిప్రాయం కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో ఉందన్నారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో జగన్ పార్టీ ఉన్నాయని కాంగ్రెస్ ధీమాతో ఉందన్నారు. అందుకే విభజన చేసిందన్నారు.












Click it and Unblock the Notifications