జైరాంకు పురంధేశ్వరి చురక, అందుకేనని డిగ్గీకి జవాబు
హైదరాబాద్: తాను భారతీయ జనతా పార్టీలో చేరడంపై మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తాను బిజెపిలో చేరినట్లు చెప్పారు. తనను కాంగ్రెసు పార్టీ గౌరవించిందనడంలో ఎలాంటి సందేహం లేదని, తాను కూడా ఎప్పుడు పార్టీ ప్రతిష్టను దిగజార్జలేదని అన్నారు.
సీమాంధ్ర హక్కుల కోసం మాట్లాడితే రకరకాలుగా తమను తప్పు పట్టారన్నారు. రామాయపట్నంలో పోర్టు అడిగితే ఇలా బురదజల్లుతారని తాను అనుకోలేదన్నారు. రామాయపట్నం వద్ద తమకు వెయ్యి ఎకరాల భూమి ఉందన్న జైరామ్ రమేష్ వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. పోర్టు అడిగితే ఇలాంటి నిందలు వేయడమేమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుండే పోటీ చేస్తానని టిఎస్సార్ పలుమార్లు చెప్పినా అధిష్టానం ఎందుకు వారించలేదో చెప్పాలని ప్రశ్నించారు.

జాతీయ పార్టీలో ఉంటేనే సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. విభజన తీరే కాదని, కాంగ్రెసు పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అధిష్టానం గౌరవం ఇచ్చినా, ఇతర పార్టీలు మాట్లాడినప్పుడు స్పందించలేదని అభిప్రాయపడ్డారు.
రామాయపట్నంలో తమకు వెయ్యి ఎకరాల భూమి ఉందని చెప్పిన జైరామ్ సర్వే నెంబర్లు చెబితే తీసుకుంటామని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర విషయంలో తమ సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. లోకసభలో బిల్లు పాస్ కాగానే తాను రాజీనామా చేశానని పురంధేశ్వరి గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు.
వ్యక్తిగత స్వార్థం కోసం బిజెపిలో చేరలేదని, బిజెపి ఒత్తిడి వల్లే సీమాంధ్రకు రాయితీలు వచ్చాయని, ముందుముందు కూడా ఆ పార్టీ వల్ల సీమాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ప్రతిష్టను తాను ఎప్పుడు బజారుకీడ్చలేదన్నారు. విశాఖ నుండి తాను మారాలని దిగ్విజయ్ సింగ్ చెప్పారని, సిట్టింగ్ ఎంపీని ఎలా మారుస్తారని తాను అప్పుడే ప్రశ్నించానని పురంధేశ్వరి చెప్పారు.












Click it and Unblock the Notifications