కాపాడాలంటూ, ఇక ప్రజల్ని ఎలా కాపాడుతావ్!: చంద్రబాబుపై పురంధేశ్వరి సెటైర్
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ఇతర నేతలు పురంధేశ్వరి తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామని 2014 ఎన్నికలప్పుడు చెప్పిన చంద్రబాబు ఆ మాటను పూర్తిగా విస్మరించారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే తనకు రక్షణగా నిలవాలని అని చెబుతున్న సీఎం చంద్రబాబు, ఇక ప్రజలను ఎలా కాపాడుతారని, వారికి ఏవిధంగా రక్షణ కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రజా సాధికార సర్వే పేరుతో రెండు లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించడం సరికాదన్నారు.
ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ, సుప్రీం కోర్టుకు.. బాబు సంచలన నిర్ణయాలు!
ప్రపంచంలోనే అవినీతిలో టీడీపీ ప్రభుత్వం నెంబర్ వన్
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పురంధేశ్వరి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని ఎంపీ గోకరాజు రంగరాజు అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చెప్పే మాయమాటలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాల రావు అన్నారు. అవినీతిలో టీడీపీ ప్రభుత్వం ప్రపంచస్థాయిలోనే నెంబర్ వన్గా ఉందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు ఆరోపించారు.
ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రభుత్వం అమ్ముకుంటోందని సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మట్టి పనుల నిర్వహణకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, అంత పెద్ద మొత్తం ఖర్చు చేయకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారన్నారు. అంగన్వాడీలోని కోడిగుడ్లు మొదలుకుని పలు ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలను టీడీపీ వారికే కాంట్రాక్ట్ అప్పగించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు.
చంద్రబాబుది ఏపీలో ఓ మాట, తెలంగాణలో మరో మాట
చంద్రబాబు ఏపీలో ఓ మాట, తెలంగాణలో మరో మాట చెబుతారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ను విమర్శిస్తోన్న చంద్రబాబు తెలంగాణలో అదే పార్టీతో పొత్తు కలుపుకోవడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఇది ఆయన అధికార దాహానికి నిదర్శనం అన్నారు.
రాజధాని రైతుల భూమి లాక్కున్నారు
రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాలను లాక్కొని రైతులకు కంటనీరు పెట్టించారని, గోదావరి పుష్కరాలప్పుడు ప్రచార ఆర్భాటంతో 29 మందిని బలిగొన్నారన్నారు. గోదావరి జిల్లాల్లో పడవ ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తుంటే వాటిని నివారించలేకపోతున్నారన్నారు. శాంతి భద్రతలు కరవయ్యాయని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఏపీకి హోదాతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారని, దానిని చంద్రబాబు వక్రీకరించి హోదా ఇస్తామని ప్రధాని చెప్పినట్లు అవాస్తవ ప్రచారం చేస్తున్నారన్నారు.