విశాఖ పురంధేశ్వరిదే, కోపం రాదు వచ్చినా..: టిఎస్సార్
పురందేశ్వరి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. ప్రజల్లో తనకు ఇమేజ్ వుందని, ఈసారి లోక్సభకు పోటీ చేస్తానని ముందుగానే సోనియా గాంధీని కలిసి చెప్పానని అయితే, విశాఖ నుంచే పోటీ చేస్తానని పురందేశ్వరి అధిష్ఠానానికి చెప్పడంతో, ఆమెను ఇబ్బందిపెట్టకూడదనే తనను మూడోసారి రాజ్యసభకు పంపించారన్నారు.
తనకు ఎవరిపైనా కోపం రాదని, వచ్చినా అది కొంత సమయమేనని, అందుకే తాను అజాత శత్రువునయ్యానని చెప్పారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానని, దైవాన్ని నమ్ముకున్న వాడినన్నారు. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై వేసిన 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసును ఇప్పటికే ఉపసంహరించుకున్నానన్నారు.
ఏదేమైనా విశాఖతో ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని, తాను ప్రారంభించిన అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. తాను కూడా అందరి మాదిరిగానే వెల్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశానన్నారు.