పట్టిసీమపై పురంధేశ్వరి వ్యాఖ్య: బాబుకు ఝలక్
అమలాపురం/ బాపట్ల: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పట్టిసీమ ప్రాజెక్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చే అవకాశమే లేదని ఆమె అన్నారు.
రాయలసీమకు నీళ్లు తరలించే లక్ష్యంతో పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు నగరి వంటి పెండింగు ప్రాజెక్టులకు పట్టిసీమ ఎత్తిపోతలకు కేటాయించిన నిధులను మళ్లిస్తే ఆ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరువేరుతాయని ఆమె అన్నారు.
అమలాపురంలో మంగళవారం బికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వరి రైతుల సదస్సులో ఆమె ప్రసంగించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులకు న్యాయం చేయడంతో పాటు క్వింటాలు ధాన్యానికి రూ.2 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించేలా కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

అదలావుంటే, పట్టిసీమ ప్రాజెక్టువల్ల ఎటువంటి నష్టం లేదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమకు, పోలవరానికి ఎటువంటి లింకులేదన్నారు. పోలవరం వల్ల ముంపు ప్రాంతాలను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంతాలను పట్టించుకొని ఆర్డినెన్స్ జారీచేసిందన్నారు. దీనివల్ల పోలవరం నిర్మించటం సులభమవుతుందని ఆయన అన్నారు.
సముద్రంలోకి వృధాగాపోతున్న నీటిని పట్టిసీమద్వారా తీసుకోవటంవలన డెల్టాతోపాటు రాయలసీమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.ప్రజలలో వున్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications