చంద్రబాబుకు మరో షాక్: పురంధేశ్వరికి ఎపి బిజెపి పగ్గాలు?
బిజెపి జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: బిజెపి జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు షాక్ ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి పెద్ద దిక్కుగా ఉన్న ఎం. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. దీంతో బిజెపి రాష్ట్ర నాయకులు రెండుగా చీలిపోయారు. వెంకయ్య నాయుడి వర్గం ఒకటి, వ్యతిరేక వర్గం మరొకటి తయారై అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే. ఆయన విజయం సాధించడానికి అవసరమైన బలం ఎన్డిఎకు ఉంది. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం కావచ్చు.
హరిబాబు పరిస్థితి ఇలా...
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్తుండడంతో ఆయన మిత్రుు, విశాపట్టణం పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపికచేస్తారంటూ బీజేపీలో ప్రచారం సాగుతోంది. చంద్రబాబుకు దూరం జరగాలనే ఉద్దేశంతోనే బిజెపి క్రియాశీలక రాజకీయాల నుంచి వెంకయ్య నాయుడిని తప్పించినట్లు చెబుతున్నారు. హరిబాబును కూడా అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తే చంద్రబాబుతో పూర్తి స్థాయిలో తెగదెంపులకు సిద్ధపడవచ్చునని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతో స్నేహం కొనసాగించాలనుకుంటే మాత్రం హరిబాబును అధ్యక్షుడిగా కొనసాగిస్తారని సమాచారం.
పురంధేశ్వరికే ఎక్కువ...
ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ఇటీవలి దాకా ప్రచారం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పేరు తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటే మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించవచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో హరిబాబును నొప్పించకుండా చూడాలని అనుకుంటున్నారు. ఆయన కేంద్రంలో మంత్రి పదవ ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది.
తొలుత ఆనందపడినప్పటికీ..
వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన అనుకూల వర్గం ఆనందపడింది. అయితే తమకు రాష్ర్టంలో క్రియాశీల రాజకీయాల్లో తమకు అండదండలు కరవవుతాయనే ఆందోళనకు గురవుతోంది. వ్యతిరేక వర్గం ఆనందపడుతోంది. ఈ సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి నేతలు పార్టీ పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పురంధేశ్వరి పేరు తెర మీదికి వచ్చినట్లు చెబుతున్నారు.
వచ్చే నెల 11 తర్వాతనే..
వచ్చే నెల 11వ తేదీ తర్వాత రాష్ర్ట పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతుందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఇది అమిత్ షా వ్యూహం ప్రకారం జరుగుతుందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కారణంగానే వెంకయ్య నాయుడిని క్రియాశీలక రాజకీయాలకు దూరం చేయాలనే నిర్ణయాన్ని మోడీ, అమిత్ షా తీసుకున్నారని అంటున్నారు.
పురంధేశ్వరి అయితే....
చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవాలని బిజెపి అధిష్టానం గట్టిగా నిర్ణయం తీసుకుంటే పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలు కావచ్చునని అంటున్నారు. ఆమెను అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఎన్టీ రామారావు ఇమేజ్ కూడా తమకే ఉపయోగపడుతుందని బిజెపి నాయకత్వం భావించవచ్చు. ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకోలేని స్థితిని చంద్రబాబుకు కల్పించవచ్చునని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా...
సోదరి పురంధేశ్వరి అంటే మాజీ పార్లమెంటు సభ్యుడు, ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు ఎంతో అనురాగం. ఆమె బిజెపి పార్టీ పగ్గాలు చేపడితే హరికృష్ణ మద్దతు కూడా పొందడానికి వీలవుతుంది. అదే సమయంలో హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి ముందుకు రావచ్చు. తాను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, పరిస్థితులు మారితే పురంధేశ్వరికి మద్దతుగా ఆయన ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.