మాస్కులు ధరించకుంటే క్వారంటైన్ కే .. ఏపీలో తీవ్ర చర్యల దిశగా అధికార యంత్రాంగం
ఏపీలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఇచ్చి జనజీవనం నార్మల్ అయ్యేలాగా ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో ప్రజలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తోంది.అయితే ప్రభుత్వ సూచనలు పట్టించుకోని జనంఇష్టారాజ్యంగా తిరుగుతుండడంతో ఏపీ సర్కార్ తీవ్ర చర్యలకు నడుం బిగించింది.
ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్ .. ఉద్యోగికి కరోనా .. ౩, 4 బ్లాకులు మూసివేత
ప్రజల తీరుతో విసిగిపోయిన అధికార యంత్రాంగం,.. బుద్ధి చెప్పే పనిలో బిజీ
మాస్కులు ధరించకుండా ఎవరైనా బయటకు వస్తే ఇక వారికి చుక్కలు చూపించే పనిలో ఉన్నారు ఏపీ అధికార యంత్రాంగం. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే వారిని ఏకంగా క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజల తీరుతో విసిగి వేసారిపోయిన అధికార యంత్రాంగం మాస్కులు పెట్టుకోని వారికి బుద్ధి చెప్పే పనిలో పడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మాస్కులు పెట్టుకోని వారి భరతం పడుతున్న పోలీసులు
కరోనా మహమ్మారి పంజా విసురుతున్నవేళ, తప్పనిసరి అవసరాలు ఉంటేనే బయట తిరిగాలని చెప్తున్నా ఇష్టారాజ్యంగా ఏపీలో ప్రజలు బయట తిరుగుతున్నారు. రెడ్, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నా,అవేవీ పట్టనట్టుగా ప్రజలు తిరుగుతున్నారు. ఇక వీరిని కట్టడి చేయడం కోసం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. మాస్క్ పెట్టుకోకుండా కనిపించిన వారినల్లా పట్టుకెళ్ళి క్వారంటైన్ సెంటర్స్ లో పడేశారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలలో మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న వారిని క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు రెవిన్యూ,పోలీసు మరియు మున్సిపల్ సిబ్బంది.
పాలకొల్లు ,తాడేపల్లిగూడెంలలో 110 మందిని క్వారంటైన్ కు పంపిన అధికారులు
ఆదివారం ఒక్కరోజే ఈ ప్రాంతాల్లో మొత్తం 110 మందిని క్వారంటైన్ కి తరలించారు. ఇక్కడ మాత్రమే కాకుండా భీమవరం, ఏలూరు, తణుకు, నర్సాపురం లలో కూడా ఈ పద్ధతిని అమలు చేయాలని, మాస్కులు లేకుంటే క్వారంటైన్ కు తరలించాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. ఒకపక్క కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా భయం లేకుండా తిరుగుతున్న ప్రజల తీరు అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
Recommended Video
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు .. జర భద్రం అంటున్న అధికారులు
ఇక ఇప్పటి వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4659 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 75 మంది కరోనా పడి మృతి చెందారు. ఇక ఏపీలో జరుగుతున్న టెస్ట్ ల విషయానికి వస్తే భారతదేశంలోనే అత్యధికంగా ఏపీలో కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు 1,915 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి . ఇక ఇదే సమయంలో 2,669 మంది కరోనా బారి నుండి బయటపడ్డారు. ఇక కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జాగ్రత్త అవసరం. లేదంటే మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు .