జగన్ ఇల్లు మారొచ్చు కానీ రాజధాని మారదు- వివేకా కేసులో త్వరలో మరో ట్విస్ట్-రఘురామ కామెంట్స్
సీఎం జగన్ త్వరలో కొత్త రాజధాని వైజాగ్ కు మారేందుకు వ్యూహరచన చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన రెబెల్ ఎంపీ రఘురామరాజు.. రాజధాని మాత్రం మార్చలేరన్నారు.
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల వ్యవహారంలో ముందడుగు వేయలేని పరిస్దితులు నెలకొంటున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ నానాటికీ వాయిదాలు పడుతుంటే.. మరోవైపు రాజదాని తరలింపుకు గడుపు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా సీఎం జగన్ ముందుగా వైజాగ్ తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన రెబెల్ ఎంపీ రఘురామ రాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ వైజాగ్ షిఫ్టింగ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ త్వరలో విశాఖ రాజధానికి మకాం మార్చబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది. వారంలో రెండు రోజుల పాటు విశాఖలోనే ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై స్పందించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్ తన నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని తెలిపారు. జగన్ విశాఖకు మారితే రాజధాని మారినట్లేనని జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు.

రాజధాని మార్పు కుదరదు
సీఎం జగన్ తన నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ఉండే హక్కుందని, కానీ రాజధాని మార్పు మాత్రం కుదరదన్నారు. జగన్ నివాసం మార్పు వార్తల నేపథ్యంలో అమరావతి రైతుల్లో రాజధాని తరలిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన రఘురామ.. రైతులు భయపడాల్సిన పని లేదన్నారు. జగన్ నివాసం మార్చినంత మాత్రాన రాజధాని మారినట్లు కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా రాజధాని మార్పు ఉండబోదన్నారు.

సుప్రీంను త్వరగా విచారించమంటే..
సుప్రీంకోర్టును అమరావతి పిటిషన్లపై త్వరగా విచారణ చేయమని రాష్ట్రప్రభుత్వ న్యాయవాదులు అడుగుతుండటాన్ని కూడా రఘురామకృష్ణంరాజు ప్రస్తావించారు. సుప్రీంకోర్టును త్వరగా విచారించమని అడిగితే మార్చి 28కి విచారణ వాయిదా వేసిందంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఈ విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని రఘురామకృష్ణంరాజు చెప్పకనే చెప్పారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాకముందే వైసీపీ మంత్రులు రాజధానిపై విచ్చలవిడి ప్రకటనలు చేయడాన్ని రఘురామ తప్పుబట్టారు.

వివేకా కేసులో త్వరలో మరో ట్విస్ట్ ?
అలాగే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలో చోటు చేసుకోబోయే పరిణామాలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్ని రఘురామ ప్రస్తావించారు. త్వరలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోందని, దీంతో ఈ కేసులో మరింత స్పష్టత వస్తుందన్నారు. వివేకా మరణం వైఎస్ కుటుంబ సభ్యులందరికీ బాధాకరమని, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని షర్మిల కోరడాన్ని రఘురామ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications