మోడీ చెప్పారు! త్వరలో శుభవార్త: హోదా కోసం శ్రీవారికి రాఘవేంద్ర రావు గడ్డం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలకు త్వరలో శుభావార్త వస్తుందని ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు అమలు కావాలని తాను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, కోరుకున్నట్లు తెలిపారు.
ఆయన సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీకి హోదా రావాలని తాను శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. హోదాకు మద్దతు విషయంలో సినిమా రంగం ముందుంటుందన్నారు. త్వరలో టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం జరుగుతుందని, ఆ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

ప్రత్యేక హోదా కోసం శ్రీవారికి గెడ్డం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తాను శ్రీవారికి మొక్కుకున్నానని, తన గెడ్డం మొక్కుకొని ఇచ్చానని రాఘవేంద్ర రావు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధాని మోడీ నెరవేర్చాలన్నారు. ఇదే తాను కోరుకున్నానని తెలిపారు.

అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతా
ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి రాఘవేంద్ర రావును టీటీడీకి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. టీటీడీ కొత్త బోర్డును నియమించినప్పుడు, అప్పుడు దర్శనం కోసం వచ్చినప్పుడు తాను దాని గురించి మాట్లాడుతానని చెప్పారు.

టీటీడీ అధికారులతో 3 గంటల భేటీ
ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనీల్ కుమార్ సింఘాల్, ఎస్వీబీసీ సీఈవో ముక్తేశ్వర రావుతో మూడు గంటల పాటు భేటీ అయ్యారు. రాఘవేంద్ర రావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా నియమితులు కానున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రాఘవేంద్ర రావు భేటీపై చర్చ
ఇదిలా ఉండగా, రాజకీయ వర్గాల్లో, టీటీడీలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోందని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా టీటీడీ బోర్డులో ఎవరైనా రెండుసార్లు ఉండవచ్చు. రాఘవేంద్ర రావు ఇప్పటికే రెండు టర్మ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఆయన భేటీ చర్చకు దారి తీసిందని అంటున్నారు. అయితే, రాఘవేంద్ర రావును ఎస్వీబీసీ చానల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications