కరోనా వ్యాక్సిన్ ఏపీలో చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటు : మరణాల సంఖ్య లోనూ-ఆ ఇద్దరి నియామకమే : రఘురామ లేఖ..!!
వైసీపీ ఎంపీ రఘురామ రాజు తన లేఖలను కంటిన్యూ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన కు నిత్యం లేఖలు రాస్తున్న రఘురామ..తాజాగా ఏపీలో వ్యాక్సినేషన్-కరోనా గురించి లేఖ రాసారు. అందులో రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వ తీరు పైన సెటైర్లు వేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. మనం అత్యధిక శాతం వడ్డీ ఇస్తామని చెబుతున్నా మనకు అప్పులు ఇచ్చేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం మంచి డాక్టర్లయినా ఇక్కడ ఉండేలా మనం నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నివశించేందుకు ప్రజలు ఇష్టపడే వీలైనా ఉంటుందంటూ రాసుకొచ్చారు.
మే, జూన్ రెండు నెలల్లో, రాష్ట్రంలో 1,68,183 మరణాలు సంభవించాయి. ప్రభుత్వం ఎంతో అదుపుచేసి మరణాల లెక్కలు ప్రకటించినా కూడా దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉందని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో చాలా మరణాలను కరోనా కింద చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా మరణాలు కాకపోతే మరి ఈ మరణాలు ఇంత పెద్ద సంఖ్యలో ఎలా సంభవించాయనే విషయాన్ని మనం పరిశోధించి తేల్చాల్సి ఉంటుందన్నారు. సుమారు లక్ష మంది మరణించడానికి కరోనా కాకుండా వేరే కారణం ఏమైఉంటుందా అనే విషయానికి మనం సమాధానం వెతికిపట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించిందని... ఇలా కేంద్ర ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందచేయడం ప్రారంభం కాలేదన్నారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే యవతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారని వివరించారు. బహిరంగ మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ ను మన రాష్ట్రంలో అమ్మే ఒక చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటులో కొనుగోలు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రయివేటు డాక్టర్లను ఏపి మెడికల్ కౌన్సిల్ కు, ఏపి మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అధిపతులుగా నియమించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు ప్రాక్టీసు చేసుకునే ఈ ఇద్దరు డాక్టర్లకు తగినంత అనుభవం లేదు . ఒకరు న్యూరో సర్జన్ అయిన డాక్టర్ శివారెడ్డి, మరొకరు అదే ఆసుపత్రిలో పని చేసే న్యూరాలజిస్టు డాక్టర్ వి.చంద్రశేఖరరెడ్డి. వీరిద్దరూ కూడా పరిపాలనా వ్యవహారాలలో ఏ మాత్రం అనుభవం లేనివారేనని వ్యాఖ్యానించారు.
Recommended Video
వీరిద్దరూ కూడా మీ వ్యక్తిగత వైద్యులు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. అనుమానాస్పద మరణాలు ఇకపై జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటామో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్క రాష్ట్రాలలో ఉండే వైద్యులను కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు తెలిసిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఉండే స్థానిక వైద్యుల్ని వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా నియమించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్నదంటూ రఘురామ లేఖలో సూచించారు.












Click it and Unblock the Notifications