రఘురామ నోటీసు: అరెస్ట్, హింసించడంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పీకర్ ఆఫీస్ ఆదేశాలు
న్యూఢిల్లీ: వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై లోక్సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత తనను తీవ్రంగా హింసించినట్లు స్పీకర్ ఓ బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డీజీపీ, సీఐడీ, ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న లోక్సభ స్పీకర్ కార్యాలయం.. దీనిపై సమగ్ర వివరాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర వివరాలు పంపాలని నోటీసులు జారీ చేసింది. కాగా, తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారంటూ ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను రఘురామ కలిసిన విషయం తెలిసిందే. అంతేగాక, సీనియర్ ఎంపీలకు లేఖలు రాసి వివరించారు. దీంతో కొందరు ఎంపీలు ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఇలావుంటే, ఏపీ సర్కారుకు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు రఘురామ కృష్ణరాజు. తాజాగా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తొమ్మిదో లేఖ రాశారు రఘురామ. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో నిషేధం కంటే మద్యపాన ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చురకలంటించారు.
రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే 16 శాతం అమ్మకాలు పెరిగాయని రఘురామ రామకృష్ణ వ్యాఖ్యానించారు. మద్యపానం నిషేధిస్తారని మహిళలు వైసీపీకి ఓటేశారని, సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్నికల హామీలపై నవ హామీలు-వైఫల్యాలు పేరుతో ఆయన మొత్తం 9 లేఖలు రాయడం గమనార్హం.












Click it and Unblock the Notifications