పవన్ కళ్యాణ్, టీడీపీ కలిస్తే వైసీపీ ఓటమి ఖాయం: రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పొత్తులపై కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ-జనసేన పార్టీ పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. మరోవైపు, టీడీపీ కూడా పొత్తులపై ఆసక్తికనబరుస్తోంది.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయం: రఘురామ
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని, అందులో అనుమానం లేదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు త్యాగం చేస్తానంటే వైసీపీకి భయం ఎందుకు?
'ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఓడించాలని చూడటం సహజం.. అందుకే ప్రతిపక్షాల ఓట్లను చీలనివ్వబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు సభలకు సహజంగానే ప్రజలు దండిగా వచ్చారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను.. ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం అని ఆయనా చెప్పారు. ఆ వ్యాఖ్యలను చూసి మా పార్టీ (వైసీపీ) ఎందుకు భయపడుతోందో నాకైతే అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లేస్తారు. లేదంటే లేదు...' అని రఘురామ పేర్కొన్నారు.

పొత్తులకు ఆసక్తిచూపుతున్న చంద్రబాబు, పవన్
కాగా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు జనసేన పార్టీతో పొత్తుపై సానుకూల వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కాగా, పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో ఒప్పటికే పొత్తు పెట్టుకున్నారు. అయితే, ఓట్లు చీలకూడదంటే పొత్తులు అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో కూడా జనసేన పొత్తు ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఏపీ బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఆ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.












Click it and Unblock the Notifications