Raghurama: రాజీనామాపై తేల్చేసిన రఘురామ..! టీడీపీ మీటింగ్స్ కూ దూరం..!
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు బ్యాంకుల రుణాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో ఆయనకూ, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ కూ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ టీడీపీ నేతలా రఘురామ చేస్తున్న వ్యాఖ్యలపై పీవీ సునీల్ కుమార్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
దీంతో రఘురామ టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగాలనే సూచనలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రఘురామరాజు ఇవాళ తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రఘురామ ఈ సందర్భంగా తేల్చేశారు. ఈ మేరకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను ఆయన ప్రస్తావించారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తనకు ఉన్న మినహాయింపులు అర్ధం కాక, ఇంగ్లీషులో ఉన్నది అర్ధం చేసుకోలేని వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తనపై అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన విషయం అంగీకరించారు. తాను స్వీయ నియంత్రణ పాటించే వాడిని అని చెప్పుకున్న రఘురామ.. అందుకే టీడీపీ సమావేశాలకు హాజరవడం లేదని గుర్తుచేశారు. అలాగని పార్టీ సమావేశాల్లో పాల్గొనకూడదనే నిబంధన కూడా లేదని రఘురామ కృష్ణంరాజు తేల్చేశారు.

మరోవైపు వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలని రఘురామ సూచించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్న అంశాన్ని ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేలు సభకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని, కానీ ఈ 60 రోజుల్లో ఒక్కసారి అసెంబ్లీకి వచ్చినా సరిపోతుందని రఘురామ మరోసారి క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications