సాయిరెడ్డిని తప్పించింది అందుకే ? రఘురామ షాకింగ్ రీజన్ ! తన హస్తంపై పుకార్ల వేళ !
ఏపీకి చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి, పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య నిత్యం జరిగే పోరును చూస్తూనే ఉంటాం. అయితే వీరిద్దరి మధ్య పోరు తాజాగా విజయసాయిరెడ్డికి దక్కిన రాజ్యసభ పదవి పోగొట్టేందుకు కారణమైందా అంటే అవుననే వాదన ఇవాళ వినిపించింది. తాజాగా విజయసాయిరెడ్డిని రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్లో నియమించిన ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్.. ఆ తర్వాత అనూహ్యంగా తప్పించారు. దీంతో ఎందుకిలా జరిగిందన్న దానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
విజయసాయిరెడ్డిని రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పదవి నుంచి తప్పించడం వెనుక రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉన్నారనే ప్రచారం ఇందులో ప్రముఖంగా జరిగింది. సాయిరెడ్డి రోజూ పెట్టే బూతు ట్వీట్లను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్ కర్ కు ఇంగ్లీష్ లో తర్జుమా చేసి పంపినట్లు రఘురామపై ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ట్విట్టర్ లో పెట్టిన అపాయింట్ మెంట్ ట్వీట్ డిలీట్ కూడా చేసేసారు. అయితే ఇవాళ ఈ మొత్తం వ్యవహారంపై రెబెల్ ఎంపీ రఘురామ స్పందించారు.
సాయిరెడ్డికి వచ్చినట్టే వచ్చి పోయిన రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పదవిపై రఘురామ స్పందించారు. అసలు సాయిరెడ్డిని ఎందుకు ఈ పదవి నుంచి తొలగించారన్న దానిపై ఆసక్తికర కారణాన్ని రఘురామ బయటపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం వల్లే సాయిరెడ్డిని ఈ పదవి నుంచి తప్పించారని రఘురామ వెల్లడించారు. సాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డిని ఈ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఈ వ్యవహారంలో సాయిరెడ్డి పదవి పోగొట్టుకున్నారని రఘురామ వెల్లడించారు. అయితే ఇందులో ఎంత నిజముందన్నది మాత్రం నిర్దారణ కాలేదు.