భళా చంద్రబాబు: 'ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు'
అమరావతి: ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు చేసిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నవ్యాంధ్ర నూతన రాజధానికి చంద్రబాబు నాయుడు ఒకసారి, ప్రధాని మోడీ మరోసారి, మళ్లీ చంద్రబాబు మూడోసారి శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా రాజధానిలో ఎలాంటి చేపట్టకుండా ఇప్పుడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి 40 వేల కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు 1500 కోట్ల రూపాయలు అడిగితే కేంద్రం 200 కోట్ల రూపాయలు భిక్షమేసిందని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు.
పేద వాడి నోట్లో మట్టి కొట్టి నిర్మించే రాజధాని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా విషయమై కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు దృష్టి మళ్ళిస్తున్నారన్నారు.
అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తొలుత మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ వరకు నిర్వహించిన పాదయాత్రలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.