టి నేతల్ని కలుస్తాం: రఘువీరా, అరిస్తే ఆపలేరు: హరీష్
అనంతపురం/మెదక్: తాము తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని కోరుతామని మంత్రి రఘువీరా రెడ్డి మంగళవారం అన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. వీధి నాటకాలు మానుకుని సమైక్యాంధ్ర కోసం పాటుపడాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు. వీధుల్లో మాట్లాడటం కాదని, అసెంబ్లీలో చర్చకు సహకరించి రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచించే విధంగా అన్ని పార్టీల నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం అనంతపురం జిల్లాలో చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎవరికివారు కాంగ్రెస్ని తప్పుబడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సమైక్యాంధ్రకు ఎవరు ద్రోహం చేశారో అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు వివరిస్తామన్నారు. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలను నియంత్రించే పార్టీలు సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్లేనన్నారు.

విభజన బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ ప్రాంత నేతలతోనూ చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో పార్టీలవారీగా ఎమ్మెల్యేల అసలు రంగు బయట పడుతుందని, ఈ సమావేశాలను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని మంత్రి అన్నారు.
అరిచినా ఆపలేరు: హరీష్ రావు
ఒంగోలు ప్రజాగర్జన సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పెద్ద గొంతు చేసుకొని ఆవేశంతో ఊగిపోయారని, ఆయన ఎంత అరిచినా, ఎంత ఆవేశం ప్రదర్శించినా తెలంగాణ ఏర్పాటు ఆగదని తెరాస సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు.
'నేను పెంచిన మొక్క కెసిఆర్.. నన్నే విమర్శిస్తాడా అనడం హ్యాస్యాస్పదం.. చంద్రబాబు కాంగ్రెస్ పెంచిన మొక్క, అంజయ్య పెట్టిన భిక్ష వల్లనే ఆయన మంత్రి అయ్యారు. అటువంటి చంద్రబాబు కాంగ్రెస్ను ఎలా విమర్శిస్తున్నారు' అని హరీశ్ రావు నిలదీశారు. సీమాంధ్ర ఓట్ల కోసం చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు సమైక్యాంధ్ర నినాదం ముందుకు తెచ్చారన్నారు.












Click it and Unblock the Notifications