టిక్కెట్పై లోకేష్ ఆశ, నాయుడు బ్రదర్స్: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల పైన ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రఘువీరా.. వెంకయ్య, చంద్రబాబులను నాయుడు బ్రదర్స్గా అభివర్ణించారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో రఘువీరా మాట్లాడారు. టీడీపీ తిరుపతిలో సానుభూతితో గెలవాలనుకుంటోందన్నారు. సానుభూతితో గెలవడానికి వెంకటరమణ సతీమణి సుగుణమ్మకు టిక్కెట్టు ఇచ్చారని ఆరోపించారు. తిరుపతి నుండి నారా లోకేష్, చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేయాలని ఆశించారన్నారు.
అయితే, అధికారం చేపట్టిన కొద్ది నెలలకే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో గెలవలేమన్న ఉద్దేశ్యంతో సానుభూతితో గెలవడానికి సుగుణమ్మకు టిక్కెట్ ఇచ్చారన్నారు. టీడీపీ ఓ విషపురుగు అన్నారు. ఓటు అనే ఆయుధంతో దానిని చంపేయాలన్నారు.
ఉప ఎన్నికల్లో మహిళలు తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని సూచించారు. మరో సందర్భంలో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా పైన నాయుడు బ్రదర్స్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నెలకోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులందరినీ కలిశానంటూ ఫోటోలు దిగే చంద్రబాబు, ప్రత్యేక హోదా గురించి ఏం చేశారో చెప్పాలన్నారు.