వెంకయ్యతో సై, వైసిపి ఐస్క్రీం పార్టీ, జగన్ సీఎం కావాలనుకున్నా: రఘువీరా
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అంశాల పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీఎం కావాలనుకున్నామని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని మంత్రులు దద్దమ్మలు అని టిడిపి, బిజెపిల పైన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు చట్టం ప్రవేశ పెట్టవలసిన అవసరం లేదని చెప్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానంతో కూడా కూడా హోదా ఇవ్వవచ్చునని చెప్పారు.
గతంలో చాలా రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారా ప్రత్యేక హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా పైన ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. టిడిపి, బిజెపిలు కలిసి ప్రజలను మోసం చేశాయన్నారు.
ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టనున్న ప్రయివేటు మెంబర్ బిల్లుకు టిడిపి, బిజెపి మద్దతివ్వాలన్నారు. పుష్కరాల కోసం రహదారుల అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చడం సరికాదన్నారు.
జగన్ పార్టీ ఐస్క్రీంలా కరగడం ఖాయం
జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐస్ క్రీంలా కరిగిపోవడం ఖాయమని రఘువీరా రెడ్డి అన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకున్నారని చెప్పారు. తాను కూడా కోరుకున్నానని చెప్పారు. ఇప్పుడు వైసిపిలో ఉన్న వారంతా అప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టిన వారే అన్నారు.