జగన్ పార్టీ డీల్ రగడ: నారాయణకు ధీటుగా రాఘవులు
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తమ పార్టీ పైన, తమ పార్టీ నాయకుల పైన చేసిన ఆరోపణలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం ఖండించారు. నారాయణ తాను చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
తాను నారాయణ పైన ప్రత్యారోపణలు చేసి రసాభాస చేయనని చెప్పారు. తాము ఎప్పుడు మిత్ర ద్రోహానికి పాల్పడలేదని చెప్పారు. జాతీయ విధానాలకు అనుగుణంగానే పొత్తులతో ముందుకు వెళ్లామన్నారు. కాంగ్రెసు పార్టీతో వెళ్లే వారితో పొత్తు ఉండదని ముందే చెప్పామన్నారు.
కాగా, అంతకుముందు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంపై విరుచుకుపడ్డారు. సిపిఎం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఖమ్మంలో తనను ఓడించడానికి తమ్మినేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి రూ.15 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు.
గతంలో పువ్వాడ నాగేశ్వర రావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని రూ.70 లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు తనను ఓడించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. తనను ఓడించేందుకు జగన్ పార్టీ నుండి రూ.15 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.
సిపిఎం పార్టీ ఓ దివాళాకోరు పార్టీగా తయారైందన్నారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సిపిఐ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా సిపిఐ పని చేసిందన్నారు. సిపిఎం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.