వైయస్కు రాహుల్ నివాళి: మొక్క నాటారు, చెక్కుల పంపణీ, చిరు ఏమన్నారు?
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం అనంతపురం చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.
* రాహుల్ పాదయాత్ర డబురవారిపల్లికి చేరుకుంది. ఈ గ్రామంలో రాహుల్ గాంధీ డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.
* రాహుల పాద యాత్ర కొనసాగుతోంది.
* మామిళకుంటుపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
* హరినాథరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి రూ. 50వేల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తదితరులు ఉన్నారు.
ఓడీసీకి చేరుకున్న రాహుల్ గాంధీ:
* ఓడీసీలోని జీవన్ జ్యోతీ స్కూల్లో చిన్నారులతో రాహుల్ కాసేపు ముచ్చటించారు. రాహుల్ రాకను పురస్కరించుకుని చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు.
ఓబులదేవర చెరువుకు చేరుకున్న రాహుల్ గాంధీ:
* చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన పుష్పలతను రాహుల్ గాంధీ ఓదార్చారు.
* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున చెక్లను రాహుల్ గాంధీ చేతుల మీదగా అందజేశారు.
* ఓబులదేవర చెరువు గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి నివాళులర్పించారు.
* రైతు భరోసా యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓబులదేవర చెరువుకు చేరుకున్నారు. ఓబులదేవర చెరువు గ్రామంలో మొక్కను నాటారు. గతంలో ఇందిరా గాంధీ ఇక్కడే బహిరంగ సభ నిర్వహించారు.
* ఓబులదేవర చెరువు నుంచి మామిళ్ల కుంట వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు.
రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే: చిరంజీవి
చిరంజీవి మాట్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించి ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభానికి ముందు చిరంజీవి విలేఖరులతో మాట్లాడారు.
* శుక్రవారం ఉదయం బెంగుళూరు నుంచి ఆయన కొడికొండ చేరుకున్నారు. ఈ క్రమంలో కొడికొండ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు.
* రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.
* రాహుల్ తన పాదయాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న 63 మంది రైతుల కుటుంబాలను కలసి.. వారితో మాట్లాడతారు. అధైర్యపడొద్దు తామున్నామంటూ భరోసా ఇస్తారు.
* అలాగే.. రైతులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలతోనే తన యాత్రను పరిమితం చేయకుండా.. విద్యార్ధులతోనూ సమావేశం కానున్నారు.
రాహల్ గాంధీ షెడ్యూల్ ఇదీ:
* ఉదయం 8.05 గంటలకు ఓబులదేవర చెరువు నుంచి మామిళకంటపల్లి వరకూ 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.
* ఇందిరాగాంధీ వేదిక నుంచి చేపట్టే ఈ యాత్రను అంబేద్కర్కు పూలమాలను వేయడంతో ప్రారంభిస్తారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళిని అర్పిస్తారు.
* పాదయాత్రలో భాగంగా ఒకే వేదికపై.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను, నేత కార్మికుల కుటుంబాలతో భేటీ అవుతారు. ఇదే సమయంలో విద్యార్థులతో పది నిమిషాలపాటు వేరుగా సమావేశమవుతారు.
* 9.45 గంటలకు మామిళకుంటుపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని రాహుల్ కలుస్తారు.
* 11 గంటలకు డబురవారిపల్లికి చేరుకొని డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశమవుతారు.
* మధ్యాహ్నాం 12.30 గంటలకు డొంకరమర్లకు వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతారు.
* ఆ తర్వాత అక్కడి నుంచి వాహనంలో బయుల్దేరి పుట్టపర్తికి చేరుకుంటారు. స్ధానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* పుట్టపర్తి సాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటారు. ఓబురదేవర చేరువు నుంచి కొండకమర్ల గ్రామం వరకు రాహుల్ గాందీ దాదాపు 10 కిలోమీటర్లు నడవనున్నారు.
* రాహుల్ యాత్రలో అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్తోపాటు ఏపీ, తెలంగాణ పీసీసీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనాయకులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.
* ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు ఓడీసీ చేరుకున్నారు.
* రాహుల్ పాదయాత్ర కోసం చేసిన ఏర్పాట్లను.. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పలరాజు, రాహుల్ వ్యక్తిగత కార్యదర్శి భయజూ తదితరులు గురువారం పర్యవేక్షించారు.