ఏపీలో ఉద్యమంలోకి ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఎమ్మిగనూరు మండలం బోడబండ నుంచి మంత్రాలయం మండలం కల్లుదేవకుంట వరకు కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు 26 మంది రాహుల్ను కలిశారు. స్టీలు ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం గురించి..కార్మికుల ఆందోళన పైన రాహుల్ కు వినితి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాహుల్ స్పష్టం చేసారు.
లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం ఆలోచించన చేయటాన్ని ఆయన తప్పు బట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉంటేనే దేశ ఆర్దిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కొనసాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసిన పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వటమే కాకుండా, అవసరమైతే కార్మికులతో కలిసి ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు వివాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు వెల్లడించారు.
పాదయాత్రలో భాగంగా గ్రామాల్లోని పొలాల్లోకి వెళ్లి రైతులతో వారి సమస్యలపైన ఆరా తీసారు. కల్లుదేవకుంటలో పత్తి రైతు కుటుంబాన్ని రాహుల్ కలిశారు. అక్కడ వేపచెట్టు కింద దాదాపు 10 నిమిషాలు రైతు కుటుంబంతో ముచ్చటించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామిని రాహుల్ దర్శించుకున్నారు. ఏపీ - కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆయనతో ఉన్నారు. పంచాయతీల నిధుల మళ్లింపుపై సర్పంచుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తానని, కేంద్ర మంత్రికి లేఖ కూడా రాస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపైన రాహుల్ మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నేతలు కోరారు.
కాగా, వర్గీకర్ణపై సంపూర్ణ అధ్యయనం తరువాత స్పందిస్తానని రాహుల్ హామీ ఇచ్చినట్లు నేతలు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ తీర్మానించడం అభినందనీయమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రుల హక్కులు - ఆత్మగౌరవం పేరుతో యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్రకు కాంగ్రెస్ మద్దతు కోరారు.