లోకసభ: జగన్ పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారంనాడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల మద్దతునూ కూడగట్టుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వద్దకు వెళ్లి మద్దతు కోరారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో తాము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి, సుష్మాస్వరాజ్పై పోరులో తమతో కలిసి రావాలని రాహుల్ గాంధీ మేకపాటిని కోరారు. దీంతో తమ స్థానాల నుంచే నినాదాలు చేస్తామని మేకపాటి రాహుల్ గాంధీకి అభయం ఇచ్చారు.

మంగళవారం లోక్సభలో విపక్ష నేతల మద్దతును కూడగట్టుకోవడంలో రాహుల్ గాంధీ సఫలమయ్యారు. ప్రతిపక్షాల నేతల దగ్గరికెళ్లి కొంతసేపు ముచ్చటించారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్కు వ్యతిరేకంగా వారితోనూ నినాదాలు చేయించడంలో సఫలమయ్యా రు. సభ మొదలవగానే లలిత్ మోడీ వివాదంపై తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
అయితే, స్పీకర్ సుమిత్రా మహాజన్ దాన్ని తిరస్కరించి, సభ నిర్వహణకు పూనుకున్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా ఒక్కసారిగా వెల్లోకి వచ్చారు. ప్లకార్డ్లతో నినాదాలు చేసుకుంటూ నిరసనకు దిగారు. ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ సభ్యులు తమతమ స్థానాల్లోనే కూర్చున్నారు. దీంతో రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్రాయ్ వద్దకు వెళ్లి మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. కొద్దిసేపయ్యాక తన సభ్యులందరికీ నిలబడి నిరసన తెలియజేయాలని సౌగత్రాయ్ సంకేతాలిచ్చారు.
ఎన్సీపీ నేత సుప్రియా సూలేలతోనూ రాహుల్ చర్చించారు. ఇక బీసీ రిజర్వేషన్లో క్రీమిలేయర్ ప్రవేశపెట్టాలన్న ఎన్బీసీ సిఫారసును ఆమోదించరాదంటూ సమాజ్వాది పార్టీ సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆ పార్టీ ఎంపీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, ఆప్ ఎంపీ భగవంత్ మాన్లతో కూడా రాహుల్ చర్చించారు.పార్లమెంటు సెంట్రల్ హాలులో సోనియా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్చించుకున్నారు.
సుష్మా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు వినూత్నంగా దక్షిణాది భాషల్లో నినాదాలు చేశారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, నంది ఎల్లయ్య ‘సుష్మా రాజీనామా చేయాలి' అని నినాదాలు చేస్తే వారికి కోరస్గా మిగతా ఎంపీలంతా తెలుగులోనే ‘రాజీనామా చేయాలి' అని నినదించారు. కన్నడ, కేరళ ఎంపీలు కూడా తమతమ భాషల్లో నినాదాలు చేస్తూ సుమారు గంటసేపు నిరసన కొనసాగించారు.












Click it and Unblock the Notifications