అవినీతి కొండ ఈ ఆర్టీవో: డైరీతో దొరికిన కోట్ల ఆస్తులు ఇవే(పిక్చర్స్)
గుంటూరు: అక్రమాస్తులు ఎడాపెడా సంపాదించి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు ఓ ఆర్టీఓ అధికారి. అతని ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. అతనే నెల్లూరు ఆర్టీవో నేరెళ్ల పూర్ణచంద్రరావు. కాగా, అతని బ్యాంక్ లాకర్లో కళ్లుచెదిరే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు విజయవాడ, హైదరాబాద్ల్లో ఆయన బంధువులు, బినామీల ఇళ్లల్లో సోమవారం సోదాలు నిర్వహించిన విషయం విదితమే. మొత్తం 14ఇళ్లు, 3కిలోల బంగారం, 60 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. కాగా, అతని మొత్తం రూ. 60కోట్ల పైమాటే ఉంటుందని అంచనా.
ఆర్టీవో నివాసం
నెల్లూరు ఆర్టీవో అధికారిగా పనిచేస్తున్న ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుంటూరు అవినీతి నిరోధకశాఖ అధికారులు గుంటూరు కొత్తపేటలోని ఆయన నివాసంతో పాటు ఆయన స్వస్థలం వినుకొండ, ప్రస్తుతం పనిచేస్తున్న నెల్లూరులో ఏకకాలంలో సోమవారం దాడులు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగిన దాడులు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి.
భారీగానే అక్రమాస్తులు
ఈక్రమంలో అతని అక్రమాస్తులకు సంబంధించిన కీలక మూలాలు అధికారులకు లభ్యమయ్యాయి. కేవలం గుంటూరులో రెండు ఖరీదైన ప్లాట్లు ఉన్నాయని ఆధారాలు సేకరించి ఆ మేరకు దాడులకు దిగిన ఏసీబీ అధికారులకు అతని అక్రమాస్తులు గుట్టలుగుట్టలుగా బయటపడటంతో కళ్లు భైర్లు కమ్మాయి. సోమవారం అంతా అతని ఇంట్లో ఏమేరకు ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయోనని ఇంటిని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో అతని అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా ఒకటి లభ్యమైంది.
డైరీతో దొరికిపోయాడు
సదరు అధికారికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కుటుంబీకులకు తెలియాలని చెప్పి ఏకంగా డైరీలో రాసి ఉంచారు. అలా ముందస్తుగా రాసి ఉంచిన డైరీనే ఏసీబీకి అతని అక్రమాస్తుల చిట్టా మొత్తాన్ని వారి చేతిలోపెట్టినట్లు అయింది. ఆ డైరీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారు అందులో ఉన్న సమాచారం ఆధారంగా మంగళవారం ఉదయం నుంచి తిరిగి తనిఖీలు నిర్వహించారు.
బంగారు, వెండి సామాగ్రి
సోమవారం రాత్రి వరకు కొనసాగిన దాడుల్లో హైదరాబాద్, నెల్లూరు, వినుకొండ, చీరాల, విజయవాడ ప్రాంతాల్లో మొత్తం ఐదు ప్లాట్లు కనుగొనగా మంగళవారం ఒక్క గుంటూరులోనే ఏడు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్లు మొత్తం చాలా పోష్ లొకాల్టీలో ఉన్నాయని వాటి ఖరీదు ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం గణిస్తే రూ.కోట్లలోనే ఉంటాయని అంచనా.
అంతా అవినీతే
ఏసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్న డైరీలో ఏ ప్రాంతంలో అతనికి ఇళ్ల స్థలాలు, ప్లాట్లు ఉన్నాయి.. ఎక్కడ బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నాయో మొత్తం అందులో రాసి పెట్టుకున్నాడు. ఆ డైరీలో గుంటూరులోని జీవిత బీమా కంపెనీ బ్రాంచి(ఎల్ఐసీ)లో రూ.35 లక్షలు పింఛన్ పథకానికి సంబంధించిన ఓ పాలసీ తీసుకుని ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఆ బ్రాంచిలో జమ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొంత్తాన్ని ఒక సంచిలో పేర్చి తీసుకెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని సంచిలో తీసుకొచ్చి ఎల్ఐసీ బా్రంచిలో జమచేసిన విషయంపై కూడా సంబంధిత బ్రాంచి అధికారులను కలిసి ధ్రువీకరించుకున్నారు.
గుంటూరులోనే భారీగా..
పూర్ణచంద్రరావు అక్రమాస్తులు చాలా వరకు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. ఆయన ప్రభుత్వ విధినిర్వహణలోకి 1985లో వచ్చారు. ఎంవీఐగా ఉద్యోగంలో చేరిన అతను ఎక్కువ కాలం గుంటూరు జిల్లాలో మంగళగిరి, బాపట్ల ప్రాంతాల్లో పనిచేశారు. ఇక్కడ పనిచేసిన కాలంలోనే అధికమొత్తంలో గుంటూరులో ప్లాట్లు కొనుగోలు చేసి అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. పూర్ణచంద్రరావు తన అక్రమాస్తులను కొంత తన అక్క పేరుతో విజయవాడ, చీరాలలో దుస్తులు దుకాణాలు రెండు ఏర్పాటు చేసి ఆమె పేరుతో బినామీగా పెట్టారని గుర్తించారు. వాస్తవానికి ఆమెకు వాటిని నిర్వహించే ఆర్థిక స్తోమత లేదని ఆమె విజయవాడలో చిరు వ్యాపారిగా బతుకు దెరువు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కొన్ని ఆస్తులు అతని వదిన పేరుతో కూడా ఉంచారని అధికారులు వివరించారు.
లాకర్లో 3కిలోల బంగారం
పూర్ణచందర్రావు రాసుకున్న డైరీలో గుంటూరు నగరంలోని కరూర్ వైశ్యాబ్యాంకులోని ఓ బ్రాంచి ఖాతాలో లాకర్ ఉన్నట్లు గుర్తించి ఆమేరకు మంగళవారం సాయంత్రం ఆ బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లాకర్ తెరిపించారు. అందులో 3 కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. నాలుగు బిస్కెట్లు, 2 వడ్డాణాలు, 15 నెక్లెస్లు.. చైన్లు ఇలా అనేక వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు బ్యాంకు బ్రాంచి ఖాతాల్లో రూ.25 లక్షల బ్యాలెన్సు, రికరింగ్ ఖాతాలో రూ.15 లక్షలు, ఇంట్లో రూ.4 లక్షలు ఉన్నాయని ఏసీబీ గుంటూరు డీఎస్పీ సీహెచ్డీ శాంతో వెల్లడించారు. పూర్ణచంద్రరావును మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.