విశాఖలో సాధ్యం కాదు - కేంద్రం భారీ ట్విస్ట్ : సీఎం జగన్ నెక్స్ట్ స్టెప్..!!
కేంద్రం ప్రభుత్వం ఏపీకి మరో షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ప్రతిపాదనల వేళ..కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది. ఇప్పటికే విశాఖలోని స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం పైన ఆందోళనలు కొనసాగుతున్న వేళ..మరో అంశం పైన క్లారిటీ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా గతంలో రైల్వే జోన్ పైన గతంలో ఇచ్చిన హామీ - ప్రకటన తూచ్ అని చెప్పింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది.
ఇక ప్రధాని చేతుల్లోనే నిర్ణయం
కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన రెండు గంటలకుపైగా జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 14 అంశాలపై చర్చ జరిగింది. నూతన రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని, అది లాభదాయకం కాదని రైల్వే బోర్డు చైర్మన్ ఈ సమావేశంలో తేల్చిచెప్పారు. అందువల్లే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇంకా ఖరారు చేయలేదన్నారు. దీని పైన ఏపీ నుంచి హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా ఇతర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..స్పందించిన కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రైల్వే జోన్ సాధ్యం కాదన్న విషయం అధికారుల స్థాయిలో నిర్ణయించడం సరికాదని.. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్ర కేబినెట్కు నోట్ పంపించాలని సూచించారు.
రాజధాని నిధుల పైనా చర్చ
రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా జోన్ ఏర్పాటు హామీ ఉందని, రాజకీయపరమైన నిర్ణయం కాబట్టి మంత్రివర్గానికి నివేదిస్తే.. సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో, ఇప్పుడు ఒక కేంద్ర మంత్రివర్గం నిర్ణయం పైన ఆధార పడి ఉంది. రాజకీయ నిర్ణయమే కీలకం కానుంది. సీఎం జగన్ విశాఖ పైన ప్రత్యేకంగా పోకస్ చేసిన ఈ సమయంలో నేరుగా ప్రధాని వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు సిద్దమైనట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజధాని అంశం పైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాజధాని నిర్మాణానికి రూ.29 వేల కోట్లు ఇవ్వాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు చేసిందని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని ఏపీ అధికారులు కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పటికే రూ.1,500 కోట్లను విడుదల చేయడం, మిగతా రూ.1,000 కోట్లు పెండింగ్పై సమావేశంలో చర్చకొచ్చింది.
సీఎం జగన్ నెక్స్ట్ స్టెప్ పై ఆసక్తి
ఆ వెయ్యి కోట్లు ఇవ్వాలంటే.. గతంలో విడుదల చేసిన రూ.1,500 కోట్ల ఖర్చుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, వివరాలతో నివేదికను అందించాలని ఏపీ అధికారులకు హోం కార్యదర్శి సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 50, 51, 56 సెక్షన్లలో పేర్కొన్న పన్నుల సంబంధిత అంశంలో లోపాలను తొలగించడానికి విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేశారు. సింగరేణికి ఆంధ్రప్రదేశ్లోనూ ఆస్తులు ఉన్న రీత్యా ఆ సంస్థ ఆస్తులను కూడా విభజించాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. సింగరేణిని విభజించే ప్రశ్నే లేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల వ్యయం, విదేశీ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల అప్పులు అంశాల పరిష్కారానికి కాగ్ సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రైల్వే జోన్ విషయంలో కేంద్ర హోం శాఖ వెల్లడించిన అంశాలే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.