తుఫాను: రైల్వే బోగీలే బాధితుల శిబిరాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉత్తారాంధ్రను హుధుద్ తుఫాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అందించిన సేవలు ప్రశంసాపూర్వకంగా ఉన్నాయి. తుఫాను ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ఏర్పాట్లు చేసింది. విజయవాడ-విశాఖకు మధ్య 55 ఖాళీ కోచ్లను ‘అత్యవసర పునరావాస కేంద్రా'లుగా అధికారులు మలిచారు.
రాజమండ్రిలో 18, తునిలో 16, సామర్లకోటలో 15, కాకినాడలో 6 బోగీలను అందుబాటులో ఉంచారు. రైల్వే స్టేషన్లు, కమ్యూనిటీ సెంటర్లు, కార్యాలయాలు, ఇతరత్రా భవనాలను కూడా సిద్ధం చేశారు. ఈ పనుల్లో రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, కాకినాడ, తుని, అనకాపల్లి స్టేషన్లు పూర్తిగా నిమగ్నమయ్యాయి.
పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 100 కు పైగా సర్వీసులు పూర్తిగా రద్దు కావడమో, దారి మళ్లించడమో జరిగిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి కోగంటి సాంబశివరావు వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఆదివారం ఒక్క సర్వీసును కూడా నిర్వహించలేదు. విశాఖ,భువనేశ్వర్ వైపువెళ్లే రైళ్లను సోమవారం మధ్యాహ్నం వరకు రద్దు చేశారు. హౌరా వైపు వెళ్లే రైళ్లను విజయవాడ, కాజీపేట, బలార్షా, నాగ్పూర్ మీదుగా మళ్లిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు.
మొత్తంమీద 62 రైళ్లు రద్దు కాగా, 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో 51 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాత్సవ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితిని, సహాయ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేందుకుగాను సికింద్రాబాద్ రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్ను, విజయవాడలో ఎమర్జెన్సీ సెల్స్ను ఏర్పాటు చేశారు.

రైళ్ల నిర్వహణపై అప్పటికప్పుడే నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ, రాజమండ్రి, నిడదవోలు, నూజివీడు, భీమవరం, మచిలీపట్నం, నర్సాపూర్, గుడివాడ, ఏలూరు, విజయవాడలతోపాటు ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, రామగుండం, బెల్లం
పల్లి, సిర్పూర్కాగజ్నగర్, స్టేషన్లలో కంట్రోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, సత్వరం స్పందించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పలు స్టేషన్లలో అదనపు విచారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు సర్వీసు రద్దు అయిన సందర్భంలో టికెట్ల ధర తిరిగి చెల్లిస్తున్నారు.దానికోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటయ్యాయి.
రద్దయిన రైళ్లు...
సికింద్రాబాద్-విశాఖ స్పెషల్, నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, హైదరాబాద్-విశాఖ గోదావరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్, తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్ప్రెస్, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్.
హెల్ప్లైన్ వివరాలు
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో 22 స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు.
కొన్ని ముఖ్యమైన స్టేషన్లలోని హెల్ప్లైన్ల వివరాలివీ..
విజయవాడ : 0866-2576796, 2767233, 2767070, 27676040
రాజమండ్రి : 0883-2420541, 2420543, 2420780, 2420790
ఏలూరు: 08812-232267
అనకాపల్లి: 08924-221698
కాకినాడ టౌన్: 0884-2374227
తాడేపల్లిగూడెం: 08818-22616
సికింద్రాబాద్: 040-27700868, 27829007
గుంటూరు: 0863-222214
తుని: 08854-252172
కాకినాడ పోర్ట్: 0884-2340592
సామర్లకోట: 0884-232882
తిరుపతి: 0877-2225810, 9676903528
హైదరాబాద్ : 040-23200865
కాజీపేట్: 0870-2548660












Click it and Unblock the Notifications