వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ గా తిరుపతి- పనుల అప్పగింత పూర్తి- ఫొటోలు షేర్ చేసిన రైల్వేమంత్రి
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్రం సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి చేశాక తిరుపతి రైల్వేస్టేషన్ ఎలా ఉండబోతోందన్న దానిపై రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ కొన్ని ఫొటోల్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. అద్భుతంగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మారుతున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు
దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చాలని భావిస్తున్నకేంద్ర ప్రభుత్వం దశల వారీగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. తొలి దశలో దేశంలోని ఎంపిక చేసిన 14 రైల్వేస్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు టెండర్లను కూడా ఖరారు చేసింది.ఇందులో ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్ కూడా ఉంది. పీపీపీ విధానంలో అయితే పనులు ఆలస్యం అవుతాయని భావిస్తున్న కేంద్రం.. ఈపీసీ విధానంలో పనుల్ని అప్పగించింది. ఈ మేరకు కాంట్రాక్టుల అప్పగింత పూర్తయినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ ట్వీట్ చేశారు.
తిరుపతి స్టేషన్ పై రైల్వేమంత్రి ట్వీట్
దేశవ్యాప్తంగా తొలిదశలో రైల్వేశాఖ అభివృద్ధి, ఆధునీకీకరణ చేయబోతున్న రైల్వేస్టేషన్లో తిరుపతి కూడా ఉంది. కేంద్రం కేటాయించిన నిధుల మేరకు తిరుపతి స్టేషన్లో పనులు మొదలు కాబోతున్నాయి. దీంతో తిరుపతి రైల్వేస్టేషన్ కు సంబంధించి అన్ని కాంట్రాక్టుల అప్పగింత పూర్తయినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే ఆయన వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వేస్టేషన్ అంటూ పేర్కొన్నారు.
అద్భుతంగా తిరుపతి స్టేషన్
తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునీకీకరణకు సంబంధించి ట్వీట్ చేసిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందులో నాలుగు ఫొటోల్ని కూడా షేర్ చేశారు. వీటిలో తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ తర్వాత ఎలా ఉండబోతోందో కనిపిస్తోంది. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ గా మారుతున్న తిరుపతి రైల్వేస్ఠేషన్ కచ్చితంగా భారత్ లోనే అద్భుతమైన స్టేషన్లలో ఒకటిగా మారే అవకాశం ఉన్నట్లు ఈ ఫొటోల్ని చూస్తే అర్ధమవుతోంది. దీంతో రైల్వేమంత్రి పెట్టిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.