ఏపీకి కేంద్రం కొత్త వరాలు - రూపురేఖలు మార్చేలా..!!
ఏపీలో రైల్వే స్టేషన్ల పైన కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1397.4 కోట్లతో రాష్ట్రంలోని 53 రైల్వే స్టేషన్లలో ఆధునీకీకరణకు నిర్ణయించింది. ముఖ్యమైన రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విమానాశ్రయాల తరహాలోనే ప్రధాన రైల్వే స్టేషన్లను మార్పు చేయాలని డిసైడ్ అయింది. ఇందు కోసం స్టేషన్లను ఎంపిక చేసింది. త్వరలో నే ఈ స్టేషన్లు కొత్త సొబగులతో సిద్దం కానున్నాయి.
సౌకర్యాల పెంపు
రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పాటించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందు కోసం స్టేషన్లో మౌలిక వసతులతో పాటుగా రూపు రేఖలు మార్చాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పలు రైల్వేస్టేషన్లను ఆధునీకీకరిస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కీలక నగరాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాలు కలిగిన రైల్వే స్టేషన్ల కొత్త సొబగుల కోసం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఏపీలోని 53 స్టేషన్లకు రూ 1397.4 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలోని తిరుపతి స్టేషన్ ను పూర్తిగా విమానాశ్రయం తరహాలో తీర్చి దిద్దేలా ప్రణాళికలు ఖరారు చేసారు.

ప్రణాళికలు ఖరారు
కొత్త స్టేషన్ల ప్రణాళికలను ఇప్పటికే ఆమోదించారు. తిరుపతి స్టేషన్ కోసం రూ 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, ఏసీ డార్మెటరీలు కడుతున్నారు. ఆకట్టుకునే విధంగా ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. రూ. 102 కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ లోనూ పునరాభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను రూ. 214 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, స్థానిక కళలు, సాంస్కృతిక చిహ్నాలు ఏర్పాటు చేయనున్నారు.
స్టేషన్లకు నిధులు
ఎంపిక చేసిన స్టేషన్లలో 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' పథకం కింద స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
అనకాపల్లి స్టేషన కోసం రూ. 27.10 కోట్లు, ఎలమంచిలి స్టేషన్ కోసం రూ. 13.13 కోట్లు కేటాయించారు. భీమవరం స్టేషన్కు రూ.22.13 కోట్లు, మంగళగిరి రైల్వే స్టేషన్కు రూ. 13.6 కోట్ల ఖర్చుతో సదుపాయాల కల్పనకు నిర్ణయించారు.
ఒంగోలుకు రూ. 19.10 కోట్లు, కడప రైల్వే స్టేషన్లలో రూ. 20.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రేణిగుంట, గూడూరు రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఆమోద దశలో ఉన్నాయి. అంతేకాదు విజయవాడ రైల్వే స్టేషన్ను సైతం రూ. 750 కోట్లతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేసారు. ఇవి పూర్తయితే ఇక రైల్వే స్టేషన్లు సైతం విమానాశ్రయాల్లో తరహాలో మారనున్నాయి.












Click it and Unblock the Notifications