తెలుగు రాష్ట్రాలకు తప్పని వాన గండం.. మరో మూడు రోజుల పాటు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. వర్షాల ప్రభావంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన పడవచ్చని అటు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం, వైజాగ్ లోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గడ్ , ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుగుణంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఈ అల్పపీడనం ప్రయాణించి బలహీన పడే అవకాశం ఉందని ఆ ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు గా వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ అల్పపీడనం తదుపరి 24 గంటల్లో బలపడి పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం వల్ల మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.