బాబుకు 'రాజధాని' చిక్కు: జగన్ చాంబర్లోకి నీళ్లు.. వీడియో ఇలా లీక్
అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక భవనాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసింది.
అమరావతి: అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక భవనాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసింది. వర్షానికి వైసిపి అధినేత జగన్ కార్యాలయంలోకి నీరు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి నేతలు మండిపడుతున్నారు.
అంతేకాదు, బుధవారం భవన పరిశీలకు వైసిపి నేతలు వెళ్లారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నల్ల రిబ్బన్లతో వచ్చిన వైసిపి నేతలు నిరసన తెలిపారు. వారిని గేటు వద్దే సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
మీడియాను రానివ్వడం లేదు
ఈ సందర్భంగా వైసిపి నేతలు మాట్లాడారు. భవనం శిథిలావస్థకు చేరిందని నిప్పులు చెరిగారు. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భవనం లోపలికి మీడియాను కూడా రానివ్వడం లేదన్నారు.
ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులకు నిరాకరణ
వైసిపి నిజనిర్ధారణ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. వారితో పాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్ నిరాకరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజా నిజాలు తెలుసుకునేందుకు తమతో పాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.
కోట్లు ధారపోస్తే.. చిన్నపాటి వర్షానికే
తమకు ఇష్టమైన ప్రయివేటు సంస్థలకు రూ.వందల కోట్లు ధారపోసి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన సభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైసిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులకు కూడా అవకాశమివ్వాలన్నారు. కేవలం 20 నిమిషాల వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జల దిగ్బంధంలో చిక్కుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్న వర్షానికే లీకులమయం
ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ.10వేలు ఖర్చు పెట్టి ప్రపంచస్థాయిలో తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా ఒకటి రెండు సెంటీమీటర్ల వర్షానికే భవనాలన్నీ లీకులమయం అయ్యాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.
వాస్తవాలు చెప్పొద్దా?
ఆ తర్వాత, ఎమ్మెల్యేలను లోపలకు అనుమతిస్తామని, మీడియాకు అనుమతి లేదని సిబ్బంది తెలిపింది. అలా అని తమకు అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు ఉన్నట్లు చెప్పారు. ఉన్న వాస్తవాలను బయట చెప్పడానికి మీడియాను తీసుకొని వెళ్దామంటే కనీసం అనుమతివ్వడం లేదని మండిపడ్డారు.
కనీసం అక్కడికైనా అనుమతివ్వాలని..
అసెంబ్లీ లోపలకు కాకపోయినా కనీసం ప్రాంగణంలో మీడియా పాయింటు ఉంది కాబట్టి, అక్కడ వరకు అనుమతించాలని కోరినా దానికి అనుతించడం లేదన్నారు. దీని వెనుక దురుద్దేశ్యాన్ని గమనించాలని, వైయస్ జగన్ చాంబరే కాదని, అసెంబ్లీ, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు కూడా ఎలా ఉన్నాయోచూపించాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
లోపల సిబ్బంది వీడియా క్లిప్ ద్వారా లీకైంది
లోపల ఎవరో సిబ్బంది తీసిన చిన్న వీడియో క్లిప్ ద్వారానే ఈ భవనాల బండారం మొత్తం బయటపడిందని, అందువల్ల లోపల భవనాల నాణ్యత ఎలా ఉందో కచ్చితంగా చూపించాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.