ఏపీలో ప్రకృతి బీభత్సం, అల్లకల్లోలం: కాలరాత్రిని తలపించిన సాయంకాలం (పోటోలు)
అమరావతి: భారీ వర్షాలు, ఈదురుగాలులతో మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు వణికిపోయాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు 18 మంది మృతి చెందారు. అమరావతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకే రాత్రి అయినట్లుగా కనిపించింది.
గాలి వానకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భయానకంగా పిడుగులు అలజడి సృష్టించాయి. నీట మునిగి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పరిస్థితిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. చాలా ప్రాంతాల్లో ఎన్నో అడుగుల మేర నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు తెచ్చింది.

చిన్నపాటి ప్రళయం
అమరావతి, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో మంగళవారం పెను గాలులు, భారీ వర్షం, చిమ్మ చీకట్లు చిన్న ప్రళయాన్ని సృష్టించాయి. వాన వెలిసిన గంటల వరకు ప్రజలు చాలా ప్రాంతాల్లో అంధకారంలో ఉండిపోవాల్సి వచ్చింది. పలు సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో పలు నగరాల్లో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు గంటల సమయం తీసుకుంది.

ఒక్కసారిగా మారిన వాతావరణం
ఉత్తరాంధ్రలో ఉదయం నుంచే వర్షాలు కురిశాయి. అమరావతి,, గుంటూరు తదితర ప్రాంతాలను ఈ వర్షం, ఉరుములు సాయంకాలం వణికించాయి. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు మూడింటి వరకు బాగా ఎండ కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. క్రమంగా చల్లబడుతూ.. గంట గడిచేసరికి ఇరుములు, మెరుపులతో వాన వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పిడుగుల గర్జన
శ్రీకాకుళం నుంచి మొదలైన పిడుగుల గర్జన చిత్తూరు వరకు సాగింది. చంద్రబాబు సాయంత్రం సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి ప్రాంతాలో ఈదురుగాలులతో కూడిన వర్షం ముంచెత్తింది. వెలగపూడిలో పెద్ద ఎత్తున గాలులు వీచాయి. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది.

ఎచ్చెర్లలో అధిక వర్షపాతం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 117.25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరుల్లో ప్రభావం అధికంగా ఉంది. లక్షలాది బస్తాల ధాన్యం, మొక్కజోన్న వర్షపు నీటిలో తడిచింది. పొలంలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. కోత దశకు వచ్చిన మామిడి రాలిపోయింది.

సీఎం నివాసం వద్ద కూలిన శిబిరాలు
గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద పోలీసులు శిబిరాలు కూలిపోయాయి. పలుచోట్ల హోర్డింగ్స్ నేలకూలాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలెంకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి పడవను ఒడ్డుకు చేర్చుతున్నాడు. అంతలోనే బలంగా ఈదురు గాలులు వీడయంతో పట కొట్టుకుపోయింది. పడవలను తెచ్చుకునే క్రమంలో అతను సముద్రంలోకి వెళ్లాడు. మొత్తంగా నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు
భారీ వర్షం రావడంతో లోతట్టు ప్రాంతాలలోకి నీరు పాగా వచ్చింది. శ్రీకాకుళం నగరం జలమయమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్లో మూడు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. కాగా, ఈ నెల 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశముందని విసాఖ తుపాను హెచ్చరికల కేంద్రంతెలిపింది. విశాఖ మీదుగా మేఘాలు ఆవరించవచ్చునని, సముద్ర ఉపరితం కూడా చురుగ్గా ఉండవచ్చునని, సముద్రంపై గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లు వేగంతో ఉండవచ్చు.

పలుచోట్ల పిడుగులు పడే అవకాశం
ఈ నెల మూడో తేదీలోపు విశాఖ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విశాఖలో భారీ పెద్ద ఎత్తున నీరు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల నీళ్లు ఇళ్లలోకి చేరింది.

బెజవాడ సహా అతలాకుతలం
విజయవాడ, గుంటూరు, అమరావతి తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీచిన భారీ గాలులకు ఎన్నో ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బెజవాడ అస్తవ్యస్తమైంది. పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు వాటిని తొలగించడానికి ఇబ్బంది పడ్డారు.

ఉద్యానపంటలకు భారీ నష్టం
అకాల వర్షాలకు ఏపీలో 18 మంది మృతి చెందగా ఏడుగురు గుంటూరులోనే మృతి చెందారు. ఆరు జిల్లాల్లో అకాల వర్షాలు కకలావికలం సృష్టించాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాలు వణికించాయి. ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది.












Click it and Unblock the Notifications