ఏపీ, తెలంగాణాలలో రెండురోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ అలెర్ట్!!
ఈసారి ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలతో విలవిలలాడుతున్నారు. ఇక ముందు ముందు ఎండా కాలాన్ని తలుచుకుంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర చత్తీస్ గడ్ పై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఆ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది . అంతేకాదు దక్షిణ తెలంగాణ మరియు ఆ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఒక ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీని ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 23-02-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/8q8wCeaRPL
— MC Amaravati (@AmaravatiMc) February 23, 2024
అంతేకాదు మరికొన్ని జిల్లాలలో వర్ష ప్రభావం కొనసాగుతుందని, అయితే ఇదే సమయంలో ఎండలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇటు తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. భానుడి భగభగలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications