మబ్బుకు చిల్లు: 24 గంటలు భారీ వర్షాలు, మనస్తాపంతో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లో మరో 24 గంటలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాధి నుంచి వస్తున్న చలిగాలులు దక్షిణాది నుంచి వీస్తున్న తేమ గాలుల్లో కలుస్తున్నాయని పేర్కొంది.
దీంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి విచ్ఛిన్నమవుతున్నాయి. క్యుములో నింబస్ మేఘాల తీవ్రత పెరిగే కొద్దీ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వడగళ్ల వాన కొన్ని చోట్ల పడుతుండగా, మరికొన్ని చోట్ల మంగళ, బుధవ వారాల్లోనూ వడగళ్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అకాల వర్షాలతో పంటలన్నీ నీటిపాలయ్యాయి. చాలా ప్రాంతాల్లో మామిడి పంట నేలరాలింది. ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య:
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో కురుస్తున్న అకాలవర్షాలతో వరి, మొక్కజొన్న అరటిపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వర్షానికి పంట నష్టపోవడంతో మనస్తాపానికి గురైన జగిత్యాల కొత్తవాడకు చెందిన ఆరె రవి(24) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.
రెండున్నర ఎకరాలు కౌలుకి తీసుకొని వరిపంట వేయగా, మరో ఎకరంన్నర తన సొంత పొలంలో మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. అకాల వర్షంతో పూర్తిగా నష్టం వాటిల్లింది. సాగుకోసం రూ.1.50 లక్షలు అప్పు చేయగా పంటనష్ట పోవడంతో అప్పుతీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు రవి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం:
ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాల వల్ల ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో ఈదురుగాలులతో పడిన వర్షానికి మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది.

మెదక్ జిల్లాలో 2.5 సెం.మీ వర్షపాతం నమోదు:
మెదక్ జిల్లా వ్యాప్తంగా గజ్వేల్, జహీరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెల్లజొన్న, వరి, అరటి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గజ్వేల్లో, జహీరాబాద్లో 2.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
నల్గొండ జిల్లాలో 18.1 మి.మీల వర్షపాతం నమోదు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భువనగిరిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం కలిగింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్యార్డ్లలో ధాన్యం తడిసింది. వర్షాలకు 4,200 హెక్టార్లలో వరిపంటకు నష్టం కలిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాలో సగటున 18.1 మి.మీల వర్షపాతం నమోదు అయ్యింది.
ఆదిలాబాద్లో 5 వేల ఎకరాల్లో పంట నష్టం:
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, ఉట్నూర్, ఆదిలాబాద్ డివిజన్లలో మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాలయ తోటలకు నష్టం వాటిల్లింది. 5 వేల ఎకరాల్లో పంటనష్టం కలుగగా, 500 ఎకరాల్లో మామిడి నేలరాలింది. నిర్మల్ మార్కెట్యార్డులో మొక్కజొన్న తడిసింది.
కర్నూలు జిల్లాలో 16.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు:
కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1350 హెక్టార్ల మేర పంటలు నష్టపోయాయి. జిల్లాలో 16.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల నియోజకవర్గంలో కురిసిన వడగళ్ల వానతో 1200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి పంట వడగళ్ల వానతో నేలకొరిగింది. అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
గుంటూరులో 200 ఎకరాల్లో అరటిపంట నష్టం:
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సత్తెనపల్లి మండలంలో 200 ఎకరాల అరటిపంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది. అంతే కాకుండా మంగళవారం కురిసిన వర్షానికి పాకాలపాడు వద్ద వాగుకు గండిపడి రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి:
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బండరావిరాల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గోద మల్లేష్కు చెందిన గొర్రెల మందపై పిడుగు పడడంతో 20 గొర్రెలు మృతిచెందాయి.












Click it and Unblock the Notifications