కిరణ్ రెడ్డి ఫోటొలను చించేసిన టీ డిసిఎం రాజయ్య
మహబూబ్నగర్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చించేశారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు ప్రభుత్వాస్పత్రిని ఆయన మంగళవారంనాడు సందర్శించారు. ఈ సమయంలో ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలు కనిపిచాయి. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలను స్వయంగా చించేశారు.
అంతకు ముందు ఆయన జడ్చర్ల ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసి ఆయన మహబూబ్నగర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రతి రోగీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకునే విధంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పారు. మందుల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిఎంహెచ్ఓ, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
939 రోగాలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తామని రాజయ్య హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్క్ కార్డుల విషంయలో త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వైద్యులను హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కార్పోరేట్ వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.