రాజయ్యను ఆస్పత్రి నుంచి గెంటేశారు: కెసిఆర్పై మోత్కుపల్లి
హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యవహారంపై తెలుగుదేశం తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను బలిపశువును చేశారని ఆయన విరుచుకుపడ్డారు. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాజయ్యను భయపెట్టి పోలీసులతో బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటికి గెంటించారని ఆయన ఆరోపించారు.
బుధవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, గడిచిన ముప్పై ఏళ్లలో మాదిగలకు ఇంత అన్యాయం జరగడం ఎనాడు చూడలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మాదిగలు చనిపోయారానుకుంటున్నారా అని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన రసమయి బాలకిషన్, నల్లాల ఓదేలు, శోభలు మంత్రి పదవులకు పనికిరారా అంటూ మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మాల, మాదిగలకు స్థానం దక్కాల్సిందేనని, మాదిగలకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని మోత్కుపల్లి హెచ్చరించారు.
గుండెపోటుతో రాజయ్య మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హైదర్గుడాలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూడున్నర గంటల పాటు ఆస్పత్రిలో ఉన్న రాజయ్య రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో డిశ్చార్జీ అయ్యారు. తిరిగి బుధవారం ఉదయం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు.