వికెట్: జగన్ పార్టీలోకి రాజన్న, కిరణ్పై మైసూరా ధ్వజం
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరు కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు రాజన్న దొర ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహ్ రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజన్న దొరతో పాటు సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వర రావు, పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, సహకార సంఘాల అధ్యక్షులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు చేరతారని ఎమ్మెల్యే సుజయ కృష్ణ ఈ సందర్భంగా చెప్పారు.
ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ... సమైక్యం కోసమే తాను జగన్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించారని, ఆయన రమణానంతరం పాలకుల వైఖరి కారణంగా ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెసు, టిడిపిలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తూ డ్రామాలాడుతున్నాయన్నారు. సమైక్యం కోసం జగన్ జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారన్నారు.
డొంక తిరుగుడు: మైసూరా
తానుండగా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎలా వస్తుందో చూస్తానన్న విభజన స్టార్ బ్యాట్స్మేన్ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పలుకులు ప్రగల్బాలుగానే మిగిలాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి వేరుగా ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం రాత్రి కడప జిల్లా కమలాపురంలోని గ్రామచావిడి వద్ద జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీడియా ఎదుట పీపుల్స్ వాయిస్ వినిపిస్తూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గర మాత్రం తలాడిస్తున్నారన్నారు.
అమె చెప్పిన మాటలు తూచ తప్పకుండా పాటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన పది గంటలలోపే అసెంబ్లీకి పంపి తన నైజాన్ని చాటుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడకు పరోక్షంగా చేయూత నిస్తున్నారని విమర్శించారు. సమన్యాయమంటూ ఢిల్లీలో దీక్షలు ధర్నాలు చేసిన చంద్రబాబు పార్టీ తెలంగాణా ఏర్పాటు కోసం కేంద్రానికి ఇచ్చిన లేఖను మాత్రం వెనక్కి తీసుకోవడం లేదన్నారు. ఈ వారం అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అనవసరంగా రాద్దాంతానికి దిగారన్నారు.