కాంగ్రెస్, తెరాసకు ఓటు వద్దు: టిలో జీవిత, రాజశేఖర్
వరంగల్/నిజామాబాద్: తెలంగాణను పదేళ్లు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటి వరకు ఊరుకొని ఎన్నికల ముందు ఓట్ల కోసం కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందని ప్రముఖ హీరో రాజశేఖర్, దర్శక నిర్మాత జీవితలు శుక్రవారం అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కలిసి వారు తెలంగాణ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. కెసిఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని వారు కోరారు.
దేశంలో నరేంద్ర మోడీ గాలి కాదు.. సునామీ వీస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సునామీలో కాంగ్రెస్ నేతలు, అవినీతిపరులు కొట్టుకుపోతారన్నారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో పేదప్రజలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించారని, అం త్యోదయ కార్డు ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించడంత పాటు నిత్యావసర వస్తువులన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండేవని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పేదలను నిరుపేదలుగా మారుస్తోందని అన్నారు.
దేశంలోని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డిలాంటి నాయకులతోపాటు అవినీతిపరులంతా కొట్టుకు పోతారని పేర్కొన్నారు. కెసిఆర్కు మోడీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడని కెసిఆర్కు బిజెపి మద్దతు లేకుండా తెలంగాణ ఎలా ఏర్పడుతుందో తెలియదా? అని ప్రశ్నించారు.
కేంద్రంలో 164మంది ఎంపీలు, తమ నాయకురాలు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడటం మూలంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు. పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కెసిఆర్ ఎన్నిసార్లు తెలంగాణకోసం మాట్లాడాడో స్పష్టం చేయాలన్నారు. కెసిఆర్ అధికార దాహంతో ఉన్నారని, దళితుడిని సిఎం చేస్తానని మాట తప్పారని విమర్శించారు. తెరాసకు ఓటెయ్యవద్దని, తెలంగాణ ఇచ్చిన బిజెపికి ఓటు వేసి మోడీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.