చూస్తూ ఊరుకోమని రాజేంద్ర ప్రసాద్: టిడిపి వర్సెస్ బిజెపి, రంగంలోకి లోకేష్
గుంటూరు: తెలుగుదేశం, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో టిడిపి యువనేత నారా లోకేష్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. చంద్రబాబు సర్కార్ పైన సోము వీర్రాజు మండిపడగా, టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ రంగంలోకి దిగారని సమాచారం. పలువురు నేతలు ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరిద్దామని పార్టీ నేతలకు ఆయన సూచించారని తెలుస్తోంది.
కాగా, బుధవారం సోము వీర్రాజు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పైన టిడిపి నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇచ్చిన నిధుల మాటేమిటని నిలదీస్తున్నారు. తెలంగాణలో పోస్టర్లలో ప్రధాని మోడీ ఫోటో ఉంటోందని, ఏపీలో మాత్రం కేవలం చంద్రబాబు ఫోటోనే ఉంటోందని నిప్పులు చెరుగుతున్నారు.
దీనిపై బుధవారం సాయంత్రం టిడిపి సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సోము వీర్రాజు మిత్ర ధర్మాన్ని మరచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తెచ్చేసుకుంటోందని, అలాగే కేంద్రం పథకాల పేర్లు మార్చేసి రాష్ట్రంలో టీడీపీ వాడేసుకుంటోందనే ఆందోళనతో బీజేపీ నేత సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సొంతవా? లేక బీజేపీవా? అనేది ఆ పార్టీ స్పష్టం చేయాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
సోము వీర్రాజు సొంత వ్యాఖ్యలైతే దీటుగా సమాధానమిస్తామని, అలాగే బీజేపీ వ్యాఖ్యలైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముందు వీర్రాజు వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆయన హద్దులు మీరి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు.