భయపెడ్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే, నవ్వడమే.. జగన్ మౌనముని: దూళిపాళ్ల
హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రజలను భయపెడుతున్నారని, భూసేకరణ పైన ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం శాసన సభలో అన్నారు. సీఆర్డీఏ పైన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
ఎక్కైడనా రాజధాని లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అరవై శాతం మంది ప్రజల మద్దతు ఉండాలన్నారు. చట్టాలు సాధారణంగా చేసిన తర్వాతే రూల్స్ ప్రేమ్ చేస్తారన్నారు. ప్రపంచ జనాభాలో భారత దేశ జనాభా 17 శాతం కాగా, భూముల శాతం మాత్రం 2.3 శాతంగా ఉందన్నారు.
మనం మార్స్ ఆర్బిట్లోకి ప్రవేశించామని, ఈ పరిస్థితుల్లో సింగపూర్ టెక్నాలజీ కావాలా అని ప్రశ్నించారు. భూమిని అభివృద్ధి చేసి ఇస్తే 70 శాతం భూమి యజమానికి వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇక్కడేమో 30 శాతం భూమిని ఎంతో దయతో ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగు పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. సాధారణ ప్రజలకు ఇచ్చే ధరతో వారు ఎక్కడికి పోవాలన్నారు. ప్రాక్టికల్గా వర్కవుట్ అయ్యే చోట రాజధానిని పెట్టాలన్నరు. రాజధానిని ఒకరేమో దొనకొండకు మారుస్తామంటారని, మరికొందరు జగ్గయ్యపేట అంటున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ అయోమయంలో: చంద్రబాబు
రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ ఉపయోగపడేలా రాజధాని మధ్యలో ఉండాలన్నారు. దొనకొండ, కర్నూలును పారిశ్రామిక రాజధానిగా చేస్తామన్నారు. తన తొమ్మిదేళ్ల పానలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు.
వైయస్ హయాంలో బలవంతంగా ఖాళీ చేయించారు: దూళిపాళ్ల
కొత్త రాజధాని మహోన్నతంగా ఉండాలని చంద్రబాబు ఆలోచన అని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఆర్డీఏ ముఖ్యమంత్రి నేతృత్వంలో పని చేసే కమిటీ అని చెప్పారు. కొత్త రాజధానిలో ఆకాశసౌధాలు ఉండాలన్నారు. వైయస్ హయాంలో 1.25 లక్షల ఎకరాలు ఎవరికిచ్చారన్నారు.
కొన్ని ఎస్ఈజెడ్లు బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. విపక్షానికి కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడటం లేదన్నారు. బిల్లులోని మంచి విషయాలు దోపిడీదారులకు కనబడవని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓ స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. జగన్ ల్యాండ్ పూలింగ్కు అనుకూలమా లేక ల్యాండ్ అక్వీషన్కు అనుకూలమా చెప్పాలన్నారు. వారు మౌనంగానే, నవ్వుతూ ఉంటారన్నారు. వారికి మౌనముని అనే పేరు ఇస్తే బాగుంటుందన్నారు.