రాజ్యసభ వార్లో పదనిసలు: 'జగన్' దూరం, విన్నర్స్!
అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. అందులో ముగ్గురికి ఓటు హక్కు లేదు. పదిహేను ఖాళీలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ (23), భారతీయ జనతా పార్టీ (4), సిపిఎ (1) ఓటింగుకు దూరంగా ఉన్నాయి. మిగిలిన 248 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, రాజ్యసభ సభ్యులు కె కేశవ రావుతో గల సాన్నిహిత్యం వల్లే ఆయనకు ఓటు వేసి ఉండవచ్చునని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలను ఉద్దేశించి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని విలీనం చేస్తానన్న తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దానికి కట్టుబడి ఉంటాలని సూచించారు.
గెలుపు వీరిదే!
చైతన్యరాజు నామినేషన్ ఉపసంహరణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి తగ్గడంతో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసు నుండి కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బిరామి రెడ్డి, ఎంఏఖాన్, టిడిపి నుండి గరికపాటి మోహన రావు, సీతారామలక్ష్మి, తెరాస నుండి కె కేశవ రావు గెలుపొందనున్నారు.
పదనిసలు
తెలుగుదేశం పార్టీ రెబల్ శాసన సభ్యులు చిన్నం రామకోటయ్య టిడిపి అభ్యర్థికి ఓటేశారు.
తెరాస వైపు వెళ్లిన తెలంగాణ ప్రాంత టిడిపి ఎమ్మెల్యే హన్మంతు షిండే ఇటీవల తాను టిడిపి అభ్యర్థికే ఓటేస్తానని చెప్పారు. కానీ ఆయన ఈ రోజు కెకెకు వేసినట్లు చెప్పారు.
కాంగ్రెసు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తిరస్కార ఓటును ఉపయోగించుకున్నారు. అధిష్టానం సూచనల ప్రకారం ఆయన మొదటి ప్రాధాన్యత ఓటును కెవిపి రామచంద్ర రావుకు వేయాలి.
మొదటి ప్రాధాన్యత ఓటును ఎంఏ ఖాన్కు, రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నిర్ణయించుకున్నారు.
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి చివరగా వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటును ఖాన్కు వేసినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేయలేదు.
అధిష్టానంపై అలకబూని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు బుజ్జగింపుల తర్వాత వచ్చి ఓటు వేశారు. ఆయనను ఎర్రబెల్లి, మహేందర్ రెడ్డిలు దగ్గరుండి తీసుకొచ్చారు. తాను నిరసనతోనే ఓటేశానని మోత్కుపల్లి చెప్పారు.
నలుగురు హైదరాబాదు ఎమ్మెల్యేలను టిఎస్సార్కు, కెవిపిలకు అధిష్టానం కేటాయించడంపై తెలంగాణ ప్రాంత నేతలు మండిపడ్డారు.
లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ టిడిపి అభ్యర్థికి ఓటేశారు.
గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు కొంత ఉత్కంఠ రేపారు. తొలుత ఆయన పిసిసి అధ్యక్షులు బొత్స ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాజ్యసభ బరిలో నిలబడతానని ఆ తర్వాత తగ్గిన జెసి దివాకర్ రెడ్డి, రెబల్గా నామినేషన్ వేసి నిన్న విత్ డ్రా అవుతున్నట్లు ప్రకటించిన ఆదాల ప్రభాకర్ రెడ్డిలు తమ మొదటి ప్రాధాన్యత ఓటును టి సుబ్బిరామి రెడ్డికి వేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే కమల కన్ఫ్యూజన్కు లోను కావడంతో ఖాళీ బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేయాల్సి వచ్చింది.