ఏపీలో ముందుముందు ముష్టి యుద్ధాలేనా? రాం గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్ లో చెప్పిందే జరుగుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైయస్సార్సీపి నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ రగడ చిలికి చిలికి గాలివానగా మారి, అధికార ప్రతిపక్ష పార్టీల నేతల వర్డ్స్ వార్ కు తెరతీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రారా తేల్చుకుందాం అంటూ రెండు పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. ఒకరిని మించి ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలు షాక్ అయ్యేలా తిట్టుకుంటున్నారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ .. బూతుల పంచాయితీ
తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్న బూతులు ఇప్పటి వరకు తాము ఎప్పుడూ వినలేదని, వాళ్ల బూతుల వల్లనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయని వైసిపి నాయకులు చెప్తుంటే, మొదట బూతులు మొదలు పెట్టింది వైసిపి నాయకులు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి ఓ గొట్టం గాడని చంద్రబాబును, పట్టాభిని గుండెల మీద ఎగిరి తంతామని ఈ రోజు కూడా ఏపీ మంత్రులు తిట్టిపోస్తున్నారు . చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని, లోకేష్ మగాడు కాదని, తాట తీస్తానని, చీరేస్తామని ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలుగుదేశం పార్టీ నేతలపై తిట్ల దండకం అందుకున్నారు వైసీపీ నేతలు.
ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
ఇక ఇదే సమయంలో టీడీపీ నేతలు సైతం మగాళ్ళు ఐతే ముందుకు వచ్చి ఫైట్ చేయాలని, పోలీసుల అండతో దాడులు చేయడం కాదు దమ్ముంటే ఎదురుగా వచ్చి నిలబడాలని ఇలా టిడిపి నేతలు కూడా కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పై వివాదాస్పద దర్శకుడు, ఏపీ రాజకీయాలపై అప్పుడప్పుడు సెటైర్లు వేసే రాంగోపాల్ వర్మ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇక ఏపీ నాయకులు త్వరలో బాక్సింగ్, కరాటే, స్టిక్ ఫైటింగ్ వంటి వాటిలో శిక్షణ పొందాల్సిందే అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
ఇప్పుడు మాటల యుద్దం .. ముందు ముందు ముష్టి యుద్ధాలేనా ?
ప్రస్తుతం తీవ్ర వ్యాఖ్యలతో దాడులు చేసుకుంటున్న, ఏపీ రాజకీయ నాయకులు ముందు ముందు ముష్టి యుద్ధాలకు దిగుతారు అన్న సంకేతాన్ని రాంగోపాల్ వర్మ తన పోస్టు ద్వారా తెలియజేశారు. రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్య అలా ఉంచితే, ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, టిడిపి వైఎస్ఆర్సిపి నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు ముందు నాయకులు రోడ్లపైన కొట్టుకునే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు సైతం రాజకీయనాయకుల తీరుపై పెదవి విరుస్తున్నారు.
దీక్షలు, ఆందోళనలు, భగ్గుమంటున్న ఏపీ రాజకీయాలు
గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తే, దానికి కౌంటర్ గా అధికార పార్టీ కూడా ఆందోళనలు చేయడం ఏపీలో కనిపిస్తుంది. ఇక ఇలాంటి వాతావరణం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న భావన ప్రజల్లోనూ వ్యక్తమౌతుంది. ఒకపక్క చంద్రబాబు 36గంటల నిరసన దీక్ష, మరోవైపు వైసీపీ జనాగ్రహ దీక్షలతో ఏపీ రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. ఇక ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో అన్నది వేచి చూడాల్సిందే.