టీ-టీడీపీ సంక్షోభం: నారా లోకేష్ చుట్టూ రాజకీయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చుట్టూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాజకీయం తిరుగుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి తదితరులు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణలో నాయకత్వం కొరవడిందా అని చంద్రబాబును ప్రశ్నించారు. నారా లోకేష్కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యుత్ సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు.

దీని పైన టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ ధీటుగా స్పందించారు. లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలి, ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించే పనిలో పడిందని విమర్శించారు. తెరాసకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
చంద్రబాబు తనయుడు లోకేష్ పైన తలసాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ టీడీపీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకోవడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా మాత్రమే ఆయన పని చేస్తున్నారన్నారు. లోకేష్ను తప్పుపడితే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, ధర్మారెడ్డిలు పార్టీని వీడటం లేదని చెప్పారన్నారు. వారు స్థానిక సమస్యల పైనే సీఎంను కలిశారన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు. తెలంగాణ సాధనలో టీడీపీ చొరవ ప్రజలకు తెలుసునని, ఎవరికైనా అనుమానాలు ఉంటే తీరుస్తామన్నారు.












Click it and Unblock the Notifications