మన్మోహన్ చెప్పారని ఎంపీ, రాజధాని సవాలేనని సీఎం చంద్రబాబు!
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదును కోల్పోయి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రామ్మోహన్ సోమవారం లోకసభలో 377 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడారు. ఏపీకి పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
హైదరాబాదును కోల్పోవటం మూలంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయిందన్నారు. విశాలమైన పారిశ్రామిక, పరిశోధన, అభివృద్ది సంస్థలు, విద్య, శిక్షణ సంస్థలు, సేవల మౌలిక సదుపాయాలను వదులుకోవలసి వచ్చిందన్నారు. విభజన మూలంగా నష్టపోయినందున ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించారని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, ఏపీలో రాజధాని నిర్మాణం సవాలేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సోమవారం రాజధాని పైన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణ సమయంలో తామూ పాత్రధారులుగా ఉన్నామన్న గుర్తింపు, వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్న భావనతో జపాన్, సింగపూర్లు చొరవ చూపిస్తున్నాయన్నారు.

రాజధాని నిర్మాణంలో జపాన్, సింగపూర్లకు బాధ్యతలు అప్పగించనున్నామన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన సిగపూర్ వాణిజ్యశాఖా మంత్రి ఈశ్వరన్ రాష్ట్రానికి వస్తున్నారని, ఈ సమయంలోనే నిర్మాణంపై కీలక చర్చలు జరుగుతాయని చంద్రబాబు వివరించారు.
రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని ఇప్పటికే కొన్ని సంస్థలకు చెప్పామని, తక్కువ స్థలంలో సింగపూర్ నిర్మాణం జరిగిందని, రాష్ట్రానికి కూడా అదే అనుకూలంగా ఉంటుందన్నారు. ఇతర అభివృద్ధి అంశాల్లో జపాన్ పాత్రధారిగా ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణంలో సమస్యలపై స్పందిస్తూ రైతులకు అన్ని విధాలా మేలు కలిగించడమే లక్ష్యమన్నారు.
అయితే కొన్ని ప్రతిపక్షాలు దీనిపై ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపించారు. గతంలో అక్కడ రాజధానే వద్దని చెప్పిన పార్టీ ఇప్పుడు రైతులకు అన్యాయం అంటూ రెచ్చగొడుతోందన్నారు. రాజధాని ప్రకటన వల్లనే అక్కడ భూముల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. అడవుల్లో రాజధాని పెడితే ఎవరూ ఉండరని, అందుకే జనజీవనం ఉన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరగాల్సి ఉంటుందన్నారు. రాజధానిని తెలుగువారి ఆత్మగౌరవం, ప్రతిష్టలకు చిహ్నంగా నిర్మిస్తామన్నారు.












Click it and Unblock the Notifications