రాములు హత్య: నిందితులు 16 మందిలో ఇద్దరు స్త్రీలు
నల్లగొండ: సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు కొనపురి రాములు హత్య కేసును కేరళ పోలీసుల సహాయంతో చేధించామని జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్రావు తెలిపారు. నయీం ఆదేశాల మేరకు అతడి మూఠా సభ్యులు ఈ నెల 11న నల్లగొండలో రాములును హత్య చేశారని, నిందితుల్లో 8 మంది అరెస్టుకాగా, నయిం సహా మరో 8 మంది పరారిలో ఉన్నారని ఆయన చెప్పారు.
గురువారం పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాములు హత్య కేసు పూర్వాపరాలను ఎస్పీ వెల్లడించారు. రాములు హత్య కేసులో 10 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా ఆరుగురు పరోక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్లయిన నయీంకు కొనపురి రాములుకు మధ్య పాతకక్షల నేపథ్యంలో అంతకుముందు రాములు సోదరుడైన మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడిని కూడా నయీం తన మూఠా సభ్యులతో హత్య చేయించాడన్నారు.
రాములు హత్య కేసులో నేరుగా పాల్గొన్న నయీం మూఠా సభ్యుల్లో ప్రధాన నిందితులు గాదరి యాదగిరి, చిలుకరాజు సురేష్, క్రాంతి, చిరంజీవి, బాబన్న, శివన్న, గాదరి సంగీత, ఎండి.రియాజుద్ధిన్, బిక్షపతిలు ఉన్నారన్నారు. వారికి సహకరించిన నిందితుల్లో సునిత, కుమారస్వామి (కరీంనగర్), రమేష్ (వరంగల్), ఎల్లేష్ (కథాల్పూర్), రవి (వరంగల్), సోమయ్య (వరంగల్) ఉన్నారని ఎస్పీ వెల్లడించారు.
వీరిలో చిలుకరాజు సురేష్, కుమారస్వామి, రమేష్, ఎల్లేష్, రవి, సోమయ్య ఈ నెల 20వ తేదీన కేరళ పోలీసులకు చిక్కారని, గాదరి యాదగిరిని, రియాజుద్ధిన్లను జిల్లా పోలీసులు ఈ నెల 21వ తేదీన అరెస్టు చేశారని, నయింతో పాటు ఇతర నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.