నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొన్న ఇన్నోవా కారు: కత్తి మహేష్కు తీవ్ర గాయాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం చంద్రశేఖర పురం జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొంది. ఆ సమయంలో కారులో ప్రముఖ సినీ విమర్శకులు, నటుడు, వ్యాఖ్యాత అయిన కత్తి మహేష్ ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ను నెల్లూరులోని మెడికేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడంతో వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు బుల్లితెరకే పరిమితమైన కత్తి మహేష్ పలు రాజకీయ పార్టీలకు టార్గెట్గా మారారు. కత్తి మహేష్ పొలిటికల్ విమర్శలు చేయడంతో ప్రత్యర్థులు కూడా అతనిపై రాజకీయ విమర్శలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో కత్తి మహేష్ పై కొందరు దాడి చేశారు. అయితే తనపై దాడి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో దేవుళ్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కత్తి మహేష్ను హైదరాబాదు వీడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని రోజుల పాటు తన సొంత జిల్లా చిత్తూరులో ఉన్నారు. ఇక అప్పుడు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ వచ్చారు.
ఇక ఆ తర్వాత తిరిగి హైదరాబాదుకు చేరుకున్న కత్తి మహేష్ మళ్లీ సినిమా రివ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కత్తి మహేష్ తలకు కట్టు కట్టారు. తీవ్ర రక్తస్రావం జరిగినట్లు ఫోటో చూస్తే తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కత్తి మహేష్ ఎక్కడికి వెళుతున్నారో తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.