ముందున్న మహోత్సవం: టీటీడీ.. కీలక ఆదేశాలు జారీ
Ratha Saptami 2025: సమస్త లోకానికి మూలాధారం సూర్యభగవానుడు. సూర్యుడు లేని ఈ జగత్తును అస్సలు ఊహించలేం. విశ్వం ఆయన చుట్టూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. హిందూ సంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకొనే పంచాగానికి ఆద్యుడు. సూర్యుడి చుట్టూ భూపరిభ్రమణం ఆధారంగానే రోజులు, వారాలు, తిథులు ఏర్పడ్డాయి.
అందుకే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటాం. సమస్త జగత్తులో చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు సూర్యుడు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞానపూర్ణుడిగా పూజిస్తుంటాం. సూర్యుడిని పూజించడానికీ ఓ రోజు ఉంది. అదే రథ సప్తమి. ఈ సంవత్సరం రథ సప్తమి ఫిబ్రవరి 4వ తేదీన అంటే మంగళవారం జరుపుకోవాల్సి ఉంది.

రథ సప్తమి పండగ కోసం తిరుమల ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ సమావేశం ఏర్పాటైంది. జేఈఓ వీరబ్రహ్మం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. టీటీడీ వివిధ విభాగాల అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచన వేయాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సమగ్ర బందోబస్తుపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెంకయ్య చౌదరి చెప్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, ఇతర ఏర్పాట్లపై గురించి ఆయా విభాగాలకు చెందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి మెట్టు టోకెన్ల జారీ కౌంటర్లపైనా సంబంధిత అధికారులతో సమీక్షించారు.












Click it and Unblock the Notifications