గోవిందుడి నామస్మరణతో పులకించిన తిరుపతి
Tirupati: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 66,764 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.14 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నాలుగు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్టుమెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

మరోవంక- శ్రీనివాసమంగాపురంలో వెలిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఎనిమిదో రోజు. ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించారు. భక్తులను కటాక్షించారు. అత్యంత వేడుకగా ఈ రథోత్సవం సాగింది.
ఈ ఉదయం 8:40 నుండి 9:40 నిమిషాల వరకు శ్రీ భూసమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.
భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
రేపటితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చివరిరోజైన బుధవారం నాడు ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.












Click it and Unblock the Notifications