‘రోజా ఆడదేనా?: జగన్, బొత్స చీడపురుగులు’
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై మంత్రి రావెల కిశోర్బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై మంత్రి రావెల కిశోర్బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన జన్మభూమి-మావూరు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ.. రోజా అసలు స్త్రీయేనా? అంటూ పరుష పదజాలం ఉపయోగించారు.
'చంద్రబాబుపై నోరుజారితే ఖబడ్దార్. నాలుకలకు కత్తెరవేస్తాం. సర్జరీ చేస్తాం. రోజా ఏం మాట్లాడుతుందండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, 'అసలు రోజా ఒక స్త్రీయేనా? స్త్రీజాతి సిగ్గుతో తలొంచుకోవాల్సి వస్తోంది. ఆమె వేషమేంటి? ఆమె భాషేంటి? ఆమె ప్రవర్తనేంటి? అసెంబ్లీలో బూతులు మాట్లాడేటటువంటి అరాచకవాది రోజా. అలాంటి రోజా కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు' అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.
వైయస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, బొత్సవంటి నాయకులు ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులని, వాటిని మందు వేసి తరిమికొట్టాలని ఎద్దేవా చేశారు. కిశోర్ బాబంటే.. జగన్కు, ఆ పార్టీ నాయకులకు భయం పట్టుకుందన్నారు.