కేసీఆర్పై రావెల ఫైర్, ఎత్తేస్తామని కొత్త కేసులా: ఓయు
చిత్తూరు/హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన స్థానికత విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవగాహన లేకుండా పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆదివారం మండిపడ్డారు.
ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి, రేణిగుంటల్లోని గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లను తనిఖీ చేశారు. తెలంగాణలో నాలుగేళ్లు నివాస మున్న విద్యార్థులంతా అక్కడ స్థానికులేనని అయితే, కేసీఆర్ పిచ్చిపట్టి మాట్లాడుతున్నారన్నారు. వారిని స్థానికేతరులని అనడం దారుణమన్నారు.
స్థానికతకు సంబంధించి 371డీ వర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తామే ఫీజు రీయింబర్స్మెంటు ఇస్తామన్నారు. ఏపీలో విద్యార్థులకు సంబంధించి త్వరలో రూ.1,070 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేస్తామన్నారు.
కొత్త కేసులా?: ఓయు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ ఓయూలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. న్యాయమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్రమకేసులు బనాయించారంటూ పలకలపై తమ పేర్లు రాసి మెడలో వేసుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద మెడలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు వివిధ రూపాలలో ఆందోళనలు చేపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. వెంటనే కేసుల్ని ఎత్తివేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేస్తామని చెప్పి ఇప్పుడు కొత్త కేసులు పెడతారా అని మండిపడ్డారు.