అప్పటికే రెండు పెళ్లిళ్లు: మూడో పెళ్లికి సిద్ధమైన వరుడు, దేహశుద్ధి
ఏలూరు: అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో పెళ్లికి సిద్ధపడి అడ్డంగా దొరికిపోయాడు. పెళ్లి కూతురు, ఆమె తరఫు బంధువులు వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఒక్కడే పీటలపై కూర్చుని పెళ్లికి సిద్దపడ్డాడు. బంధువులు ఎవరూ లేరని వారు పెళ్లి కొడుకుని ప్రశ్నించారు.
నేనుంటే చాలదా? రెండు దండలూ పసుపుతాడు సరిపోవా? అంటూ అతను ఎదురు ప్రశ్నించాడు. దీంతో పెళ్లి కూతురు వైపు బంధువులకు అనుమానం వచ్చింది. విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని అతనికి దేహశుద్ధి చేశారు.
ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నమ్మి రవి పెయింటర్. ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన కొద్దిరోజులకే ఇద్దరు భార్యలు కాస్త రవిని వదిలించుకుని వెళ్లిపోయారు. దీనితో రవి తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఓ పెళ్లిళ్ల పేరయ్య రవికి రాజమండ్రి సంబంధం తెచ్చాడు. దాంతో రాజమండ్రికి చెందిన అమ్మాయి ఇంటికి కూడా పెళ్లి చూపులకు వెళ్లాడు.
దీనితో అమ్మాయికి కూడా ఎవరూ లేకపోవడంతో బంధువులు రవికి పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం రాత్రి పెళ్లిచేసుకునేందుకు అమ్మాయి, అమ్మాయితో పాటు మరో 70 మంది బంధువులు పాలకోడేరు వచ్చేశారు. తీరా రాజమండ్రి నుంచి ప్రత్యేక వాహనంలో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అమ్మాయి, అమ్మాయి బంధువులు రవిని చూసి నోరు వెళ్లబెట్టారు.
గ్రామంలోని పెద్దలకు చెప్పుకున్నారు. దీనితో పెద్దలు సైతం మీరు మీరు ఈ గొడవను తేల్చుకోవాలని దులిపేసుకున్నారు. దీనితో ఇక చేసేదేమి లేక బరువైన భారంతో అమ్మాయి, అమ్మాయి తరుపు బంధువులు రాజమండ్రి వెళ్ళిపోయారు.